ఏడు నెలలకుపైగా రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు పశ్చిమ దేశాల నుంచి భారీగా మద్దతు లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఉక్రెయిన్కు బ్రిటన్ కొన్ని హెచ్చరికలు చేసింది. ఉక్రెయిన్లో చాలా చోట్ల ఆస్పత్రులు, స్కూల్స్, అపార్ట్ మెంట్ బిల్డింగులు ఈ యుద్ధంలో నాశనమయ్యాయి. నికోపోల్లోని గ్యాస్ పైప్లైన్లు, ప్రైవేటు బిల్డింగులు, పవర్లైన్స్ చాలా వరకు రష్యా దాడుల్లో ధ్వంసం అయ్యాయని చెప్పిన యూకే.. ఈ దాడులు మరింత పెరిగే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది.
తాము దాడులు చేయాల్సిన టార్గెట్ జోన్ను రష్యా మరింత పెంచుకునే అవకాశం ఉందంటూ హెచ్చరికలు చేసింది. ఇప్పటికే డోనెస్క్ ప్రాంతంలో రష్యా దాడుల్లో ఐదుగురు ప్రజలు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. అయితే తాము కేవలం మిలటరీ స్థావరాలనే టార్గెట్ చేస్తున్నామని, సివిల్ సదుపాయాలపై ఒక్క దాడి కూడా చెయ్యలేదని రష్యా వాదిస్తూనే ఉంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలైన ఈ పోరు.. నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి ఏడునెలలపైగా కొనసాగుతున్న ఈ పోరు వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది మహిళలు, పిల్లలు బోర్డర్ దాటి చుట్టుపక్కల దేశాల్లో తలలు దాచుకుంటున్న సంగతి తెలిసిందే. యుద్ధం ఆపేందుకు రెండు దేశాల మధ్య జరిగిన చర్చలేవీ ఇప్పటి వరకు సత్ఫలితాలను ఇవ్వలేదు.