టెహ్రాన్, మే 5: హొర్మూజ్ జలసంధి మళ్లీ రణరంగంగా మారింది. ఈ జలసంధిలో చిక్కుకుపోయిన వాణిజ్య నౌకలను సురక్షితంగా బయటకు తీసుకొస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడం’.. అగ్గి రాజేసింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన ఇరాన్ సోమవారం యూఏఈపై ప్రతీకార దాడులకు దిగింది. ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లోని ఓ చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడులు నిర్వహించింది.
ఈ దాడితో అక్కడ భారీ మంటలు చేలరేగగా, ముగ్గురు భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు. వీరికి ప్రాణాపాయం లేదని.. దవాఖానలో చికిత్స పొందుతున్నారని స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. అయితే, యూఏఈపై ఇరాన్ దాడుల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. మౌలిక సదుపాయాలు, అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేసింది.