లండన్, జనవరి 23: భీకరమైన ఇషా తుఫాన్ తాకిడికి బ్రిటన్, ఐర్లాండ్లలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. 100కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. రైల్వే సేవల్ని నిలిపివేస్తున్నట్టు రైల్ ఆపరేటర్లు మంగళవారం ప్రకటించారు. లండన్, డబ్లిన్ సహా పలు విమానాశ్రాయాల్లో వేలాదిమంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. సరైన తిండి, నిద్రలేక తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నామని ప్రయాణికులు సోషల్మీడియాలో ఫొటోలు, వీడియోలు విడుదల చేస్తున్నారు.
ఒక్క డబ్లిన్లోనే 160 ఫ్లైట్స్ రద్దయ్యాయి. పలు విమానాల్ని ఫ్రాన్స్, జర్మనీకి దారిమళ్లించటంతో ప్రయాణికులు దిగాల్సిన చోట కాకుండా, మరో చోటకు చేరుకున్నారు. అధికారులు బ్రిస్టోల్, లండన్, డబ్లిన్ ఫ్లైట్స్ను పారిస్కు, స్కాట్లాండ్ ఫ్లైట్ను జర్మనీ నగరం కోగ్నేకు దారిమళ్లించారు. దీంతో వందలాది మంది యూకే ప్రయాణికులు సోమవారం రాత్రంతా విదేశాల్లోని విమానాశ్రయాల టెర్మినల్స్ వద్ద తలదాచుకోవాల్సి వచ్చింది.