Turkey Syria Earthquake | తుర్కియే, సిరియా దేశాలపై సోమవారం విరుచుకుపడిన భూకంప విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం అక్కడ మృతి చెందిన వారి సంఖ్య 9,500కి చేరినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. రెండు దేశాల్లో కలిపి 30 వేల మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడినట్లు తెలిపాయి.
భారీ భూకంపం ధాటికి వేల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద లక్షల మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల నుంచి వేలాది మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీస్తున్నాయి. ఈ భారీ ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘోర విపత్తులో 20 వేల మందికిపైగా మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అంచనా వేసిన విషయం తెలిసిందే.