ఈ ఏడాదీ కరోనా సెగ
అమ్మకాలపై లాక్డౌన్ల ప్రభావం
ముంబై, మే 11: వరుసగా రెండో ఏడాదీ అక్షయ తృతీయకు కరోనా సెగ తప్పట్లేదు. గతేడాది కొవిడ్-19 దెబ్బకు దేశవ్యాప్త లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే.. ఈ ఏడాది మహమ్మారి ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు మెజారిటీ రాష్ర్టాలు లాక్డౌన్ను తీసుకొస్తున్నాయి. దీంతో ఈసారి కూడా అమ్మకాలు ఆవిరైపోయినట్లేనన్న ఆవేదన నగల వర్తకుల్లో కనిపిస్తున్నది. ఈ నెల 14న అక్షయ తృతీయ వస్తుండగా, ఈ రోజున బంగారం, వెండి కొనుగోళ్లు శుభప్రదమని భారతీయుల భావన. కానీ కరోనా కారణంగా మార్కెట్లో నెగెటివ్ కన్జ్యూమర్ సెంటిమెంట్ నెలకొన్నదని రత్నాలు, ఆభరణాల పరిశ్రమ వాపోతున్నది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ భయోత్పాతాన్నే సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాణాంతక అంటువ్యాధి వచ్చిన దగ్గర్నుంచి శుభకార్యాలు గణనీయంగా తగ్గిపోగా, ఇప్పుడు దేశంలో రోజుకు సుమారు 4 లక్షల మందికి వైరస్ సోకుతున్నది. దీంతో అంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తున్నదని, ఇక బంగారం, నగల కొనుగోళ్లకు వచ్చేవారెవరని వ్యాపారులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
ధరలు తగ్గినా..
నిరుడు ఆగస్టులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రికార్డు స్థాయిలో గరిష్ఠంగా రూ.58,000 పలికింది. కానీ ప్రస్తుతం రూ.48,700-49,000 శ్రేణిలోనే ధరలున్నాయి. అయినప్పటికీ కొనేవారే కరువయ్యారు. సగటున గతేడాది 70 శాతానికిపైగా వ్యాపారాన్ని కోల్పోయామని, ఈసారి అంతకుమించే నష్టం వాటిల్లనుందని ఓ వ్యాపారి అన్నారు. ప్రధాన మార్కైట్లెన ముంబై, ఢిల్లీ, పుణెల్లో దుకాణాల మూసివేత ఓవైపు.. కేరళ, తెలంగాణ, ఏపీ, పశ్చిమ బెంగాల్లో పడిపోయిన కొనుగోలు సెంటిమెంట్ మరోవైపు పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయని చెప్తున్నారు.
‘గతేడాది కంటే ఈ ఏడాది కరోనా ఉద్ధృతి భయంకరంగా ఉన్నది. నిత్యం ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వైరస్ కట్టడికి చాలా రాష్ర్టాలు లాక్డౌన్ను ప్రకటించడంతో ఎక్కువ శాతం రిటైల్ దుకాణాలన్నీ మూతబడ్డాయి. ఈసారి కూడా అక్షయ తృతీయ అమ్మకాలు దూరమైనట్లే’
-ఆశిష్ పీతే, అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి చైర్మన్