Tulsi Gabbard | వాషింగ్టన్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) హ్యాకింగ్ చేయడం చాలా సులభమని, మళ్లీ ఎన్నికల్లో బ్యాలట్ పత్రాలను ఉపయోగించడంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బర్డ్ పిలుపునిచ్చారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న క్యాబినెట్ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈవీఎంల భద్రతా లోపాలను ఆమె ఆధారాలతో సహా ఈ సమావేశంలో నిరూపించారు. 2020 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అప్పటి సైబర్ సెక్యూరిటీ చీఫ్ క్రిస్ క్రెమ్స్ చర్యలపై దర్యాప్తు చేపట్టాలని న్యాయ శాఖను(డీఓజే) ఆదేశిస్తూ పాలనాపరమైన ఉత్తర్వులపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేసిన మరుసటి రోజే ఈ సంచలన వ్యాఖ్యలు వెలువడడం గమనార్హం.
చాలా కాలంగా ఈవీఎంలు హ్యాకర్లకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తులసీ గబ్బర్డ్ వెల్లడించారు. పోలైన ఓట్ల ఫలితాలను మార్చడం హ్యాకర్లకు చాలా సులభమని ఆమె అన్నారు. స్పేస్ ఎక్స్ సీఈఓ మస్క్ నిరుడు ఈవీఎంల విశ్వసనీయతపై సందేహం వ్యక్తం చేశారు. ఈవీఎంలను నిర్మూలించాలని కోరారు.
భారత్లో ఉపయోగించే ఈవీఎంలను హ్యాకింగ్ చేయడం సాధ్యమేనంటూ వస్తున్న ఆరోపణలను కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలు శుక్రవారం తోసిపుచ్చాయి. మన దేశ ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంలు సాధారణ కాలిక్యులేటర్ తరహాలో పనిచేస్తాయని, ఈవీఎంలను ఇంటర్నెట్ లేదా ఇన్ఫ్రారెడ్కు అనుసంధానించడం లేదని ఈసీ అధికారులు వివరించారు.