Trump Tariffs | ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసినప్పటికీ ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏ మాత్రం తగ్గడం లేదు. మళ్లీ టారిఫ్ల మీద టారిఫ్లు విధిస్తూనే ఉన్నారు. ముందుగా ప్రపంచ దేశాలన్నింటిపై 10 శాతం టారిఫ్ విధిస్తున్నామని ప్రకటించిన ట్రంప్.. కాసేపటికే వాటిని మరింత పెంచారు. గ్లోబల్ దిగుమతులపై 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. భారత్కూ 15 శాతం టారిఫ్లే వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్ ప్రకటించారు.
చట్టానికి అనుగుణంగా 15 శాతానికి టారిఫ్లు పెంచుతున్నామని ట్రంప్ తెలిపారు. అమెరికాకు వ్యతిరేకంగా హాస్యాస్పదంగా, పేలవంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా సమీక్షించాకే సుంకాల పెంపు నిర్ణయానికి వచ్చామని పేర్కొన్నారు. ప్రతీకార సుంకాలు లేకుండా పలు దేశాలు అమెరికాను ఎన్నో దశాబ్దాలుగా దోచుకుంటున్నాయని తెలిపారు. అందుకే ఆ దేశాలపై తొలుత 10 శాతం టారిఫ్లు విధించామని.. చట్టబద్ధంగా వాటిని15 శాతానికి పెంచుతామని ప్రకటించారు. రాబోయే నెలల్లో అదనంగా మరిన్ని టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. “మేక్ అమెరికా గ్రేట్ అగైన్” కార్యక్రమంలో భాగంగా చట్టబద్ధమైన కొత్త టారిఫ్లను త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏమీ మారలేదని.. భారతే తమకు టారిఫ్లు చెల్లిస్తుందని.. తాము భారత్కు ఎటువంటి సుంకాలు చెల్లించబోమని స్పష్టం చేశారు.
అమెరికా ట్రేడ్ చట్టం 1974లోని సెక్షన్ 122 ప్రకారం ఇతర దేశాల ఉత్పత్తుల దిగుమతులపై 15 శాతం టారిఫ్లను విధించే అధికారం ఆ దేశాధ్యక్షుడికి ఉంటుంది. అయితే 150 రోజుల్లోపు దీనికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా 150 రోజుల వరకు ఈ టారిఫ్లను అమెరికా అధ్యక్షుడు అమలు చేయవచ్చు.