వాషింగ్టన్: మిత్ర దేశం అంటూనే భారత్పై తన అక్కసును వెళ్లగక్కారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). 25 శాతం సుంకాలతోపాటు జరిమానాలు కూడా విధించారు. ఈ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే మన శత్రుదేశం పాకిస్థాన్తో (Pakistan) జట్టుకట్టారు. ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం (Trade Deal) చేసుకున్నట్లు వెల్లడించారు. పాక్తో భారీ చమురు నిల్వల అభివృద్ధికి ఒప్పందం కుదిరినట్లు ప్రకటించారు. భారత్కు పాకిస్థాన్ ఏదో ఒక రోజు చమురు విక్రయించవచ్చని వెల్లడించారు. భాగస్వామ్యానికి నాయకత్వం వహించే చమురు కంపెనీని ఎంపిక చేసే ప్రక్రియ కనసాగుతున్నదని తన సామాజిక మాధ్యమం ట్రూత్ వేదికగా తెలిపారు.
‘ఈ రోజు వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి వైట్హౌస్లో చాలా బిజీగా గడిపా. పలు దేశాల నాయకులతో మాట్లాడా. వారంతా అమెరికాను చాలా సంతోష పెట్టాలని అనుకుంటున్నారు. ఈ మధ్యాహ్నం దక్షిణ కొరియాకు చెందిన వాణిజ్య బృందంతో చర్చలు జరుపనున్నా. కొరియా ప్రస్తుతం 25 శాతం సుంకాల జాబితాలో ఉంది. ఆ సుంకాలను తగ్గించుకునే ప్రతిపాద వారి వద్ద ఉంది. అది ఏంటో వినడానికి నేను ఆసక్తిగా ఉన్నా.
ఇప్పుడే పాకిస్థాన్తో ఒప్పందం కుదుర్చుకున్నాం. భారీ చమురు నిల్వల అభివృద్ధికి పాక్తో ఒప్పందం కుదిరింది. భాగస్వామ్యానికి నాయకత్వం వహించే ఆయిల్ కంపెనీని గుర్తించే పనిలో ఉన్నాం. పాకిస్థాన్ ఏదో ఒక రోజు భారత్కు చమురు విక్రయించవచ్చు. అనే దేశాలు సుంకాలను తగ్గించుకోవాలని అనుకుంటున్నాయి. ఇవన్నీ మన వాణిజ్య లోటును చాలా పెద్ద ఎత్తున తగ్గించడంలో సహాయపడతాయి’ అంటూ ట్రంప్ వెల్లడించారు.
ప్రతీకార సుంకాలకు పెట్టిన గడువు ముగియడానికి రెండు రోజుల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. బుధవారం భారత్పై 25 శాతం టారిఫ్లను విధించారు. దీనిపై జరిమానాలు కూడా ఉంటాయని తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా ప్రకటించారు. తమ దేశంలోకి వచ్చే అన్ని భారతీయ వస్తూత్పత్తుల ఎగుమతులపై ఆగస్టు 1 నుంచి ఇవి వర్తిస్తాయని అందులో స్పష్టం చేశారు. కానీ ప్రస్తుతం పడుతున్న 10 శాతం కనీస సుంకాలకు ఇవి అదనమా? కాదా? అన్నది చెప్పలేదు. జరిమానాలు ఎంత? అన్నదీ ప్రకటించలేదు.
అయితే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా తేలకపోవడం, అమెరికా ప్రతినిధుల బృందం ట్రేడ్ డీల్పై 6వ విడుత చర్చల కోసం ఆగస్టు 25 నుంచి భారత్లో పర్యటించనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు మంగళవారమే చెప్పిన నేపథ్యంలో అగ్రరాజ్యాధినేత తాజా నిర్ణయం మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నదిప్పుడు. ఇదిలావుంటే ట్రంప్ టారిఫ్ల ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నా మని కేంద్రం తెలిపింది. ఇరు దేశాలకు ప్రయోజనకర వాణిజ్య ఒప్పందం కుదురు తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
సైనిక, ఇంధన అవసరాల దృష్ట్యా రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున ఆయుధాలను, చమురును కొంటున్నది. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ తీరును ట్రంప్ తప్పుబడుతున్నారు. ఉక్రెయిన్పై దాడులను రష్యా ఆపాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయని, కానీ రష్యాతో వాణిజ్య సంబంధాలను భారత్, చైనాలు అంతకంతకూ పెంచుకుంటూపోతున్నాయని ట్రంప్ ఆక్షేపిస్తున్నారు. దీనివల్ల రష్యాను ఒంటరిని చేద్దామనుకున్న తమ లక్ష్యాలు నెరవేరట్లేదని, ఇదేమీ బాగాలేదంటున్న ట్రంప్.. ఈ క్రమంలోనే భారత్పై ఈ అదనపు సుంకాలు, పెనాల్టీలను తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. కాగా, ఇటీవలికాలంలో జపాన్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లనూ ఇదే రీతిలో అధిక సుంకాలు వేస్తామంటూ దారిలోకి తెచ్చుకున్న ట్రంప్.. అదే పాచికను భారత్పైనా ప్రయోగిస్తుండటం గమనార్హం.
వాణిజ్య ఒప్పందం కోసం గతకొద్ది నెలలుగా భారత్-అమెరికా మధ్య నడుస్తున్న సంప్రదింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల అమెరికా మెచ్చేలాగే ఈ చర్చలు ఫలప్రదమవుతాయన్న ఆశాభావాన్ని ఎయిర్ఫోర్స్ వన్లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ వ్యక్తం చేశారు. కాగా, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియుష్ గోయల్ సైతం భారత ప్రయోజనాలు దెబ్బతినకుండానే అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటామన్న విశ్వాసాన్ని కనబరుస్తున్నారు. త్వరలోనే ట్రేడ్ డీల్ జరుగుతుందన్న ధీమాను విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా వెలిబుచ్చుతున్నారు.
అయితే తాను విధించిన ప్రతీకార సుంకాలకు చివరి గడువు ఆగస్టు 1 అని, దీన్ని ఇక పొడిగించేది లేదని ట్రంప్ అంటున్నారు. దీంతో మొత్తం ఈ వ్యవహారంపై తీవ్ర ఉత్కంఠనే నెలకొన్నది. ఈ ఏడాది ఏప్రిల్ 2న భారత్ (26 శాతం)సహా అనేక దేశాలపై ట్రంప్ ప్రతీకార సుంకాలను ప్రకటించిన సంగతి విదితమే. అయితే ఆయా దేశాల ఆందోళనలు, విజ్ఞప్తులు, అభ్యంతరాల మధ్య 90 రోజులపాటు వాయిదా వేసి జూలై 9ని గడువుగా విధించారు. ఆ తర్వాత దీన్ని ఆగస్టు 1కి తీసుకెళ్లారు. అయితే ఏప్రిల్ 2 నుంచి 10 శాతం కనీస టారిఫ్లు వర్తిస్తున్నాయి. అలాగే తమ దేశంలోకి వచ్చే ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం, ఆటో రంగ ఉత్పత్తులపై 25 శాతం అదనపు సుంకాలను ట్రంప్ వేశారు.