న్యూఢిల్లీ: వాళ్లు ఉగ్రవాదాన్ని రాజకీయ పనిముట్టుగా ఉపయోగిస్తున్నారని పొరుగు దేశం పాకిస్థాన్ను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఇవాళ ఐక్యరాజ్యసమితి సాధారణసభలో ప్రసంగిస్తూ ప్రధాని పాకిస్థాన్ ప్రస్తావన తీసుకొచ్చారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ శుక్రవారం ఇదే సభలో జమ్ముకశ్మీర్ విషయంలో చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోదీ తన వ్యాఖ్యల ద్వారా కౌంటర్ ఇచ్చారు. ప్రపంచంలో వెనుకబాటుకు దారితీసే ఆలోచనలు, తీవ్రవాదం అంతకంతకే పెరుగుతున్నాయని ప్రధాని ఆందోళన వ్యక్తంచేశారు.
ఉగ్రవాదాన్ని రాజకీయ పరికరంగా ఉపయోగిస్తున్న వాళ్లు అది ఎప్పటికైనా వాళ్లకు కూడా ప్రమాదకరమేననే సంగతి తెలుసుకోవాలని పాకిస్థాన్ను ఉద్దేశించి ప్రధాని పరోక్ష సూచన చేశారు. కాగా, పాకిస్థాన్లో లష్కరే ఎ తాయిబా, జైష్ ఎ మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. ఈ విషయాన్ని భారత్ ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించింది. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడికి సూత్రధారి అయిన ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్లోనే చిక్కాడు. అంతేగాక భారత సరిహద్దు వెంబడి పాకిస్థాన్ భూభాగంలో అనే ఉగ్రవాద క్యాంపులు ఉన్నాయి. 2019 ఫిబ్రవరిలో బాలాకోట్లోని ఓ క్యాంపుపై భారత్ వైమానిక దాడులు చేసింది.