దేశంలో క్యాన్సర్ మరణాలకు చెక్ పెట్టేందకు న్యూజిల్యాండ్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. సిగరెట్లపై పూర్తిగా నిషేధం విధించాలని భావిస్తూ..త్వరలో చట్టం తీసుకురానుంది. ఈ చట్ట ప్రకారం ముఖ్యంగా 2008 తరువాత జన్మించిన యువతకు సిగరెట్లు విక్రయించకూడదు.
న్యూజిల్యాండ్లో ప్రతి ఏడాది 4,500 నుంచి 5,000 మంది ధూమపానం వల్ల చనిపోతున్నారని ప్రభుత్వం తెలిపింది. ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ ఆయేషా వెరాల్ మాట్లాడుతూ.. “దేశ భావితరానికి స్మోకింగ్ నుంచి విముక్తి కలిగించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం” అని అన్నారు.
స్మోకింగ్ని బ్యాన్ చేయడానికి క్రమక్రమంగా సిగరెట్లు విక్రయించే షాపులను తగ్గిస్తామని, అలాగే.. సిగరెట్లలో నికోటిన్ శాతం కూడా తక్కువ ఉండేలా చట్టాలు తీసుకువస్తామని ఆమె తెలిపారు.
న్యూజిల్యాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.