Imran Khan : పాక్ క్రికెట్ మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం అక్కడి జైలులో ఖైదీగా ఉన్నారు. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని వార్తలు వస్తున్న వేళ ఆయన చెల్లెళ్లు చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. జైలులో ఇమ్రాన్ ఖాన్ను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని వారు ఆరోపించారు. ఇమ్రాన్ సోదరీమణులు డా.ఉజ్మా ఖాన్, అలీమా ఖాన్ తాజాగా మీడియాతో మాట్లాడారు.
తనను చంపేందుకు కుట్రలు చేస్తున్నారని స్వయంగా ఇమ్రాన్ ఖాన్ తమతో చెప్పినట్లు వారు వెల్లడించారు. వీరిద్దరూ ఇటీవల జైలులో ఇమ్రాన్ను కలిశారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ వారితో మాట్లాడుతూ పాకిస్తాన్ ఆర్మీ అధ్యక్షుడు అసిమ్ మునీర్, పాక్ మంత్రి, పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ కలిసి తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని చెప్పాడు. ఇందుకోసం ఇప్పటికే ఒక ప్రణాళిక రచించినట్లు తనకు సమాచారముందని ఇమ్రాన్ చెప్పాడన్నారు. ఇమ్రాన్ ఖాన్కు ఏదైనా జరిగితే నిందితుల్ని, వారి భవిష్యత్ తరాల్ని కూడా వదిలిపెట్టబోమని చెల్లెళ్లు హెచ్చరించారు. మోసిన్ నఖ్వీ తమను బెదిరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇమ్రాన్ ఖాన్కు వారి పర్సనల్ డాక్టర్ డా.అసిమ్, డా.ఫైజల్తో చికిత్స అందించాలని అతడి చెల్లెళ్లు కోరగా.. ప్రభుత్వం ఇందుకు నిరాకరించింది.
మరో బంధువు పేరు సూచించినా ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. ప్రభుత్వం వేరే డాక్టర్లతో చికిత్స అందిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా.. ఇమ్రాన్ ఖాన్కు మంచి చికిత్స అందించాలని ఇటీవల సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ వంటి క్రికెటర్లు లేఖ రాసిన సంగతి తెలిసిందే.