బీజింగ్, అక్టోబర్ 11: భారత్, చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు ఇప్పట్లో తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. షెడ్యూల్డ్ విమానాలను ఆకస్మికంగా రద్దు చేసే విధానాన్ని చైనా అమలుచేస్తుండటమే ఇందుకు కారణం. చైనాకు వచ్చే ప్రయాణికుల్లో ఎవరికైనా కరోనా సోకినట్టు నిర్ధారణ అయితే ఆ దేశం నుంచి విమాన సర్వీసులను చైనా నిలిపివేస్తున్నది. కరోనా నేపథ్యంలో మూడేండ్ల నుంచి భారత్, చైనా మధ్య విమాన రాకపోకలు నిలిచిపోయాయి. కరోనా కారణంగా చైనా లో చదువును మధ్యలోనే వదిలేసి వచ్చిన భారత వైద్య విద్యార్థులు ఇప్పుడు ఆ దేశానికి వెళ్లాలంటే నానాఅవస్థలు పడాల్సి వస్తున్నది. ఇరుదేశాల మధ్య నేరుగా విమానాలు లేకపోవడంతో హాంకాంగ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్ గుండా చైనాకు వెళ్తున్నారు.