America | అగ్రరాజ్యం అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన మంచు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుఫాను కారణంగా అమెరికా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 60మందికి పైగా మృత్యువాత పడ్డారు. మంచు తీవ్రత మరీ ఎక్కువగా ఉండటంతో రహదారులన్నీ కనిపించటం లేదు. దీంతో చాలా చోట్ల ప్రమాదాలు జరిగి చనిపోతున్నారు. చాలా నగరాల్లో కరెంటు సరఫరా ఆగిపోయి ఆ ప్రాంతాలన్నీ చీకటిమయమై పోయాయి. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో అత్యవసర సమయాల్లో అంబులెన్స్లు సైతం రాలేని పరిస్థితి నెలకొంది. విమానాలు, రైళ్లు, ఇతర వాహనాల సర్వీసులను రద్దు చేయాల్సివచ్చింది. బఫెలో ఎయిర్పోర్టులో 43 అంగుళాల మేర మంచు పేరుకుపోయిందని ఆ దేశ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
న్యూయార్క్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నట్లు గవర్నర్ క్యాథీ హోచుల్ అన్నారు. రోడ్లపై ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోవడంతో వాహనాలు వెళ్లడానికి వీల్లేకుండా పోయిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో సుమారు 30 నుంచి 40 ఇంచులమేర మంచు కప్పుకుపోయినట్లు తెలిపారు. అక్కడి పరిస్థితిని అధ్యక్షుడు జో బైడెన్ దృష్టికి తీసుకెళ్లినట్లు గవర్నర్ వివరించారు.
అటు.. జపాన్లోనూ మంచు తీవ్రతకు 17 మంది మృత్యువాతపడ్డారు. సుమారు 93 మంది కనిపించకుండా పోయారు. చలి తీవ్రంగా పెరిగిపోయి జనం గడగడ వణికిపోతున్నారు. తీవ్రమైన మంచు తుఫాన్ ధాటికి జనం ఇళ్ల నుంచి కాలు బయట పెట్టలేకపోతున్నారు. హీటర్లు వేసుకుని ఇండ్లలోనే ఉంటున్నారు. జపాన్కు ఉత్తరంగా ఉన్న హొకైడో, దక్షిణంగా ఉన్న క్యుషుతో పాటు అర్చిపెలాగో దీవుల్లో మంచు తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ మంచు పొరల స్థాయులు 1.20 మీటర్ల స్థాయికి చేరాయి.