ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం త్వరలో ఆవులు, బర్రెలు పెంచుకోవడంపై పన్ను వేసే అవకాశం ఉన్నది. స్థానిక వార్త పత్రిక డైలీ టైమ్స్ కథనం ప్రకారం మరియం నవాజ్ సర్కారు ప్రతి పశువుకూ రోజుకు 30 పాకిస్థానీ రూపాయల రుసుమును చెల్లించడాన్ని తప్పనిసరి చేసే అవకాశం ఉన్నది. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని ప్రోత్సహించే ‘సుత్రా పంజాబ్’ బయో గ్యాస్ కార్యక్రమంలో భాగంగా పశువుల యజమానుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. దీనిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రుసుమును ‘పేడ పన్ను’గా అభివర్ణించాయి.
ఇప్పటికే సాగు ఖర్చులు, ద్రవ్యోల్బణంతో దెబ్బ తిన్న రైతుల నుంచి పన్ను రూపంలో డబ్బులు పిండుకొనేందుకు ప్రభుత్వం వేసిన ఎత్తుగడ అని విమర్శించాయి. అయితే 168 పశువుల కాలనీల్లోని 50 లక్షల పశువుల యజమానుల నుంచి ఈ పన్ను వసూలు చేసేందుకు మరియం ప్రభుత్వం ప్రణాళికలు వేస్తున్నది. దీని ప్రకారం ప్రతి పశువుకు ప్రతి రోజూ పన్ను విధిస్తారు. ఈ మొత్తాన్ని బయో గ్యాస్ తయారీకి వినియోగిస్తారు.