కాబూల్: తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదార్ ( Mullah Abdul Ghani Baradar ) శనివారం కాబూల్ చేరుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వ ఏర్పాటు గురించి ఆయన కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. జిహాదీ నేతలు, రాజకీయవేత్తలతో బరాదార్ ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. గత ఆదివారం తాలిబన్లు కాబూల్ను వశపరుచుకున్న విషయం తెలిసిందే. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల రాజ్యంగా మారింది. అయితే ప్రభుత్వ ఏర్పాటు అక్కడ కీలకంకానున్నది.
తాలిబన్ నేత బరాదార్ను 2010లో పాకిస్థాన్లో అరెస్టు చేశారు. అమెరికా వత్తిడి వల్ల ఆయన్ను 2018 వరకు కస్టడీలో ఉంచారు. ఆ తర్వాత ఆయన్ను ఖతార్కు తరలించారు. దోహాలో ఉన్న తాలిబన్ పొలిటికల్ ఆఫీసుకు అధిపతిగా అతన్ని నియమించారు. ఆఫ్ఘన్ నుంచి అమెరికన్ దళాలు వెనక్కి వెళ్లడానికి కీలకమైన సమావేశాలను ఆయనే నిర్వహించారు. దోహాలో జరిగిన శాంతి ఒప్పందాల్లో పాల్గొన్నారు. నిజానికి ఖతార్ నుంచి మూడు రోజుల క్రితమే బరాదార్ తాలిబన్లకు కేంద్రమైన కాందహార్ చేరుకున్నాడు.