సౌరాష్ట్ర వర్సిటీ పరిశోధకుల సర్వేలో వెల్లడి
రాజ్కోట్, మే 12: ‘మాకు ఇమ్యూనిటీ ఎక్కువ. వైరస్ సోకినా ఏం కాదు’ కొంతమంది యువతలో ఉన్న అపోహ, అతివిశ్వాసం ఇది. ఈ అతివిశ్వాసంతోనే అనవసరంగా రోడ్లమీదకు వస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొవిడ్ నిబంధనలను పాటించకుండా కరోనా మహమ్మారి ఉద్ధృతికి కారణం అవుతున్నారు. గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన సౌరాష్ట్ర యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు డింపాల్ రమణి, హస్ముఖ్ చావ్డా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కరోనా ఆంక్షలు అమల్లో ఉన్నా కూడా రోడ్లపై తిరుగుతున్న కొంత మందిని ప్రొఫెసర్లు సర్వేలో భాగంగా ప్రశ్నించారు. అందులో 1,080 మంది సరైన కారణం లేకుండా ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. వీరిలో 71 శాతం మంది 15-40 ఏండ్ల మధ్య వయసున్నవారే. ‘దుకాణాలు, మాల్స్ సూపర్ స్ప్రెడర్స్ అని భావించాం. కానీ నిర్లక్ష్యపు యువత కూడా సూపర్ స్ప్రెడర్లుగా మారుతున్నారు’ అని ప్రొఫెసర్లు చెప్పారు.