అమెరికా అధ్యయనంలో వెల్లడి
లాస్ఏంజెల్స్, ఏప్రిల్ 19: కరోనా బాధితుల్లో దాదాపు 30 శాతం మందిలో ‘లాంగ్ కొవిడ్’ లక్షణాలు కనిపిస్తున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. వైరస్ బారిన పడినప్పటి నుంచి నెలల తరబడి ఈ లక్షణాలు వేధిస్తున్నట్టు తేలింది. అలసట, శ్వాస ఇబ్బంది, వాసనను పసిగట్టలేకపోవడం వంటి లక్షణాలు వారిలో దీర్ఘకాలం కొనసాగుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ఏంజెల్స్(యూసీఎల్ఏ) పరిశోధకులు పేర్కొన్నారు. దవాఖానల్లో చేరిన వారు, డయాబెటిస్, అధిక బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) ఉండే వారిలో లాంగ్ కొవిడ్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ముందస్తు చర్యలు తీసుకోండి
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐదు రాష్ర్టాలకు కేంద్రం ముందస్తు జాగ్రత్త సూచనలు చేసింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేయాలని, ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ, యూపీ, హర్యానా, మహారాష్ట్ర, మిజోరం రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ మంగళవారం లేఖ రాశారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కొవిడ్ నిబంధనల అమలు వంటి ఐదంచెల సూత్రాలను పాటించాలని సూచించారు.
ఆరోగ్య కార్యకర్తల బీమా స్కీమ్ పొడిగింపు
కొవిడ్-19 సంబంధిత విధుల్లో ఉండే ఆరోగ్య కార్యకర్తలకు బీమా పథకాన్ని మరో 180 రోజులు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. హెల్త్కేర్ వర్కర్లపై ఆధారపడి ఉండే వారికి ఆర్థికపరమైన భద్రత కల్పించేందుకు పాలసీని పొడిగింపునకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 2020, మార్చి 30న ప్రారంభించిన ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్(పీఎంజీకేపీ)’ బీమా స్కీమ్ కింద ఇప్పటి వరకు 1,905 క్లెయిమ్స్ను పరిష్కరించామని పేర్కొన్నది.