శ్రీలంక తదుపరి ప్రధానిగా రణీల్ విక్రమ సింఘే గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా భారత్కు, భారత ప్రధానికి విక్రమ సింఘే ధన్యవాదాలు తెలిపారు. తమ దేశం ఇబ్బందుల్లో వున్న సమయంలో భారత్ తమకు సహాయం చేసిందని, అందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని విక్రమ సింఘే వివరించారు.
భారత్తో తాను సన్నిహిత, సత్సంబంధాలనే కోరుకుంటున్నానని, ఆ దిశగానే పని చేస్తానని ప్రధాని విక్రమ సింఘే ప్రకటించారు. ప్రజాస్వామ్య బద్ధంగా, నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తాము కూడా రెడీ ఉన్నామని భారత్ స్పందించింది. అలాగే శ్రీలంక ప్రజానీకానికి అవసరమైన సహాయం అందిస్తామని కూడా హామీ ఇచ్చింది.
శ్రీలంక కొత్త ప్రధానిగా ప్రతిపక్ష యూఎన్పీ పార్టీ నేత రణిల్ విక్రమ సింఘే(73) గురువారం ప్రమాణం చేశారు. అంతకుముందు అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధికార ఎస్ఎల్పీపీ, ఇతర పార్టీల నేతలతో తన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధాన మంత్రిగా విక్రమ సింఘేకు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో, గొటబయ అధ్యక్ష కార్యాలయంలోనే విక్రమ సింఘే చేత ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ప్రధాని మహింద కూడా విక్రమ సింఘేకు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు.