Sri Lanka | పొరుగు దేశం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఇంకా కొనసాగుతున్నది. నిధుల కొరత కారణంగా ఈ నెల 25న నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు శ్రీలంక ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. ప్రధాని దినేష్ గుణవర్దేణ, ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన మరునాడే ఎన్నికల సంఘం ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం ఏర్పడింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధులు విడుదల చేసినట్లు ఆర్థికశాఖ అధికారులు ధృవీకరించిన తర్వాతే ఎన్నికల నిర్వహణ తేదీలు ప్రకటిస్తామని శ్రీలంక ఎన్నికల సంఘం డైరెక్టర్ జనరల్ సమన్శ్రీ రత్నాయకే తెలిపారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గత నెల తొమ్మిదో తేదీన స్థానిక సంస్థల ఎన్నికలు జరుగాల్సి ఉంది. కానీ, నిధుల కొరత వల్ల ఈ నెల 25కు వాయిదా పడ్డాయి. గత ఫిబ్రవరి 21-24 మధ్య బ్యాలెట్ పత్రాలను ముద్రించడానికి శ్రీలంక ప్రభుత్వ ముద్రణా సంస్థ అధికారి గంగానీ లియనాగే అశక్తత వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణకు 500 మిలియన్ రూపాయలు ఖర్చవుతుండగా, కేవలం రూ.40 మిలియన్లు మాత్రమే వచ్చాయని గంగానీ లియానాగే తెలిపారు.
శ్రీలంకలో 340 లోకల్ కౌన్సిళ్లకు కొత్త పాలక మండలి ఏర్పాటు కోసం ఎన్నికలు జరుగాల్సి ఉంది. వీరి పదవీ కాలం నాలుగేండ్లు ఉంటుంది. గడువు ప్రకారం గతేడాది మార్చిలో జరుగాల్సి ఉంది. కానీ, ఆర్థిక సంక్షోభం వల్ల గతేడాది నుంచి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వాయిదా పడుతూ వస్తున్నది. పూర్తిగా అప్పుల ఊబిలో చిక్కుకున్న శ్రీలంకను ఆదుకునేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) 300కోట్ల డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది.