Ranil Wickremesinghe | శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అధికారిక పర్యటన నిమిత్తం ఈ నెల 21న భారత్కు రానున్నారు. 21, 22లలో భారత్లో ఆయన పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా రణిల్ విక్రమ సింఘే.. భారత ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం కానున్నారని అధికార వర్గాలు తెలిపాయి. శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రణిల్ విక్రమ సింఘే.. భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి కానున్నది. దివాళా అంచున నిలిచిన శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందన్న సంకేతాల మధ్య భారత్లో విక్రమసింఘె పర్యటించనుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది.
తీవ్రమైన సంక్షోభంతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిన నేపథ్యంలో ప్రజలు నాటి అధ్యక్షుడు గోటబయ్య రాజపక్సెపై తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో గోటబయ్య రాజపక్సే స్థానంలో శ్రీలంక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు స్వీకరించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు విక్రమసింఘే దేశాధ్యక్షుడిగా కొనసాగుతారు. విక్రమసింఘే పర్యటన నేపథ్యంలో వచ్చేవారం విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్ర.. శ్రీలంకలో పర్యటిస్తారు. విక్రమసింఘే పర్యటనకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆ దేశ అధికారులతో చర్చిస్తారని సమాచారం.
విద్యుత్, పెట్రోల్, వ్యవసాయం, నౌకాయానం తదితర రంగాల్లో భారత్ చేపట్టిన ప్రాజెక్టులపై ప్రధాని నరేంద్రమోదీ, తదితరులతో విక్రమ సింఘె చర్చిస్తారు. అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘెతో పాటు శ్రీలంక విద్యుత్తు, ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేఖర్, విదేశాంగ మంత్రి అలీ సాబ్రీ, మత్స్యశాఖ మంత్రి డాగ్లస్ దేవానంద తదితరులు పర్యటిస్తారని వార్తలొచ్చాయి.