వాషింగ్టన్ : (US Special Bill) ఆఫ్ఘనిస్తాన్ను గుప్పిట్లో పెట్టుకుని ఇతర తీవ్రవాద సంస్థలకు దన్నుగా నిలిచిన తాలిబాన్ను అణిచివేసేందుకు అమెరికా శత విధాలుగా ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా అమెరికన్ సెనేట్లోని 22 మంది రిపబ్లికన్ సభ్యులు ఒక బిల్లును ప్రవేశపెట్టినట్లు సమాచారం. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే తొలుత పాకిస్తాన్పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ నాశనం అవడం ఖాయమంటున్నారు. ఈ బిల్లును ప్రవేశపెట్టడంతో ఇమ్రాన్ ప్రభుత్వం, అక్కడి సైన్యం, ఐఎస్ఐ.. ఇలా అన్ని సంస్థలూ భయందోళలో ఉన్నట్లు వారు చెప్తున్నారు. బిల్లు ఆమోదం పొందడంలో ఇబ్బంది పడే అవకాశం కూడా తక్కువేనంటున్నారు నిపుణులు. పాకిస్తాన్ చేష్టలపై అమెరికా సెనేట్లోని డెమొక్రాట్లు, రిపబ్లికన్లకు దాదాపు ఒకే అభిప్రాయం ఉండటమే దీనికి కారణం. ఇమ్రాన్ ఖాన్తో డోనాల్డ్ ట్రంప్ కలిశారు. అయితే, ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధానితో ఫోన్లో కూడా మాట్లాడడానికి జో బైడెన్ సిద్ధంగా లేకపోవడం విశేషం.
సెనేట్లో ప్రవేశపెట్టిన ఈ బిల్లు పేరు ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, పర్యవేక్షణ, జవాబుదారీతనం. ఈ బిల్లును తయారు చేసిన కమిటీకి రిపబ్లికన్ సెనేటర్ జిమ్ రీస్ అధ్యక్షత వహించారు. ఈ బిల్లు తయారీలో పలు పార్లమెంటరీ కమిటీలు సహకరించినట్లు తెలుస్తున్నది. అమెరికా రక్షణ కార్యదర్శి, విదేశాంగ కార్యదర్శి, నిఘా సంస్థలు 180 రోజుల్లో ఈ కమిటీలకు మొత్తం సమాచారం అందించనున్నట్లు సమాచారం. అనంతరం సుదీర్ఘంగా చర్చించిన మీదట చట్టం చేస్తారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదిస్తే ఈ చట్టం అమలులోకి వస్తుంది.
ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉన్న పలంగా సైన్యాన్ని వెనక్కి రప్పించిన బైడెన్ ప్రభుత్వంపై అటు ప్రజల్లో, ఇటు మీడియాలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దీని నుంచి బయటపడేందుకు ఈ బిల్లును తీసుకొచ్చి తాలిబాన్ను అణిచివేయాలని బైడెన్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. తాలిబాన్తోపాటు పాకిస్తాన్కు కూడా గుణపాఠం చెప్పేందుకు వీలుగా బిల్లును సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది.
కాగా, ఈ విషయం తెలియగానే పాకిస్తాన్ మంత్రి షిరిన్ మజారీ అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘20 ఏండ్లపాటు అమెరికా, నాటో దళాలకు వెన్నుదన్నుగా నిలిచాం. ఇప్పుడు ఈ బిల్లును సెనేట్లో ప్రవేశపెట్టారు. ఇక మేం కఠిన పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే, మేం ఎవరికీ లొంగిపోం’ అని కామెంట్ చేశారు.
హిమపాతంలో చిక్కుకున్న నేవీ సిబ్బంది.. గాలింపు ముమ్మరం
ఈ గడ్డపై పుట్టిన ఈ ఇద్దరు మహనీయులు అమరులు
మహిళల్లో రొమ్ము క్యాన్సర్ నివారణకు చిట్కాలు
అహ్మదాబాద్లో గుంతలు పూడ్చిన ఖర్చు రూ.693 కోట్లు!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..