న్యూయార్క్ : అమెరికాలో స్థిరపడ్డ తెలుగు దంపతులు వికాస్ సిన్హా-అనురాధ దంపతులు మరోసారి మంచి మనసు చాటుకున్నారు. తెలుగు మూలాలున్న వీరు యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్కు 20 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.190 కోట్లు) విరాళంగా అందజేశారు. వికాస్ సిన్హా హైదరాబాద్లోని ఉప్పల్లో ఉండే కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నారు. 1984-88లో శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసి పై చదువుల కోసం అమెరికా వెళ్లారు.
అక్కడ మాస్టర్స్ చేసిన తర్వాత ఉద్యోగం చేస్తూ యూఎస్లోనే స్థిరపడ్డారు. టెక్ రంగంలో అంచెలంచెలుగా ఎదిగిన సిన్హా.. ప్రస్తుతం బ్రాడ్కామ్ కంపెనీలో మెయిన్ ఫ్రేమ్ సాఫ్ట్వేర్ విభాగానికి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. దాంతో పాటు యూఎస్టీ కాలేజీలో ఇన్ఫర్మేషన్ లీడర్షిప్ బోర్డులోనూ సేవలందిస్తున్నారు. ఇదే యూనివర్సిటీకి ఈ దంపతులు గతంలోనూ విరాళం అందించారు. వీళ్లు అందజేసిన విరాళాలతో ఏఐ, అడ్వాన్స్డ్ అనలటిక్స్ కాలేజీలో నాణ్యమైన విద్యతో పాటు పరిశోధనలను విస్తరిస్తామని వర్సిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సహాయానికి గుర్తుగా ఏఐ విభాగానికి అనురాధ-వికాస్ సిన్హా పేర్లు పెడుతామని వర్సిటీ ప్రకటించింది.