హైదరాబాద్: పగటి పూట అతిగా నిద్రపోతే (Daytime sleep) రోగాలను కోరి తెచ్చుకున్నట్టేనని ఓ అధ్యయనంలో తేలింది. మెట్రో నగరవాసుల జీవనశైలి, నిద్ర వేళలపై పరిశోధకులు చేసిన అధ్యయనాన్ని ఒబేసిటీ జర్నల్ (Obesity journal) తాజాగా ప్రచురించింది. బోస్టన్లోని బ్రిగ్హామ్, ఉమెన్స్ దవాఖాన పరిశోధకులు 3,000కిపైగా వ్యక్తుల జీవనశైలిపై అధ్యయనం చేశారు. ఊబకాయం, నిద్ర, జీవక్రియల మధ్య సంబంధాన్ని పరిశోధించారు. మధ్యాహ్నం అరగంట కంటే ఎక్కువ సేపు నిద్రపోయే అలవాటు ఉన్నవారిలో క్రమంగా డయాబెటిస్, హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులు పెరిగే ప్రమాదం ఉన్నదని పరిశోధనలో వెల్లడైంది. నిద్రావస్థలో ఉన్నప్పుడు జీవక్రియలు మందగించటంతో దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉన్నదని తేలింది. నిత్యం 25-30 నిమిషాల కంటే ఎక్కువ కునుకు తీసే అలవాటు ఉంటే… ఇబ్బందులు తప్పవని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్టు తేలింది. లంచ్ తర్వాత కాసేపు నిద్రపోయే అలవాటు ఇతర దీర్ఘకాలిక రోగాలను ఆహ్వానిస్తున్నదని పరిశోధకులు చెప్తున్నారు.
నిజానికి పగటిపూట అతిగా నిద్రపోవడానికి రాత్రి పూట నిద్రలేమి కారణమని గుర్తించారు. దీంతోపాటు అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, స్లీప్ డిజార్డర్స్, ఒబేసిటీ కారణాల చేత రాత్రిపూట కంటే పగటిపూటనే ఎక్కువగా నిద్రపోతారని గుర్తించారు. దీంతో రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోయే అలవాటు తప్పుతున్నదని తేల్చారు. ఇదే అలవాటు దీర్ఘకాలంపాటు కొనసాగితే శారీరక జీవక్రియలు మందగించి అధిక బరువు, రక్తపోటు, ఇన్సులిన్ విడుదలలో మార్పులు సంభవిస్తున్నట్టు గ్రహించారు. రాత్రిపూట 7 నుంచి 8 గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోయే అలవాటు ఉన్న వారి కంటే మధ్యాహ్నాం పూట అరగంటకు మించి నిద్రపోయిన వారి గుండె పనితీరులో భారీ వ్యత్యాసం ఉండగా, బరువు కూడా వేగంగా పెరిగినట్టు తేలింది.