Iran ceasefire : ఇరాన్తో శాంతి చర్చలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ ఆచితూచి స్పందిస్తోంది. ముందుగా చర్చల ప్రసక్తే లేదని తేల్చిన ఇరాన్, ఇప్పుడు మాత్రం స్వరం మార్చింది. తమ ప్రతిపాదనలకు అంగీకరిస్తే అమెరికాతో చర్చలు జరుపుతామని ప్రకటించింది. ఈ మేరకు అమెరికాకు కీలక ప్రతిపాదనలు చేసింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక క్యాంపులను ఎత్తివేయడం అన్నింటికంటే కీలకమైన షరతు. అలాగే, ఇరాన్పై ఉన్న ఆంక్షల్ని ఎత్తివేయడంతోపాటు నౌక రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధిపై పూర్తి హక్కు కలిగి ఉండాలి.
అలాగే, యుద్ధం వల్ల తమకు కలిగిన నష్టానికి పరిహారాన్ని కూడా ఇరాన్ కోరింది. దీంతోపాటు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని కూడా ఇజ్రాయెల్ డిమాండ్ చేసింది. హార్ముజ్ జలసంధి నుంచి రవాణా చేసే నౌకలపై పన్ను వసూలు చేస్తారు. దీనికి సంబంధించి పూర్తి ఆధిపత్యం తమకు దక్కాలని ఇరాన్ కోరుతోంది. ఇకపై ఈ ప్రాంతంలో తిరిగి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూస్తామని అమెరికా హామీ ఇవ్వాలి. ఇలాంటి అనేక డిమాండ్లను ఇరాన్.. అమెరికా ముందుంచింది. వీటితోపాటు కొన్ని అంశాల విషయంలో ఇరాన్ పట్టువీడినట్లు తెలుస్తోంది. ఐదేళ్లపాటు బాలిస్టిక్ మిస్సైళ్ల తయారీని నిలిపివేస్తామని తెలిపింది. అలాగే, యురేనియం నిల్వల్ని కూడా తగ్గించుకునేందుకు అంగీకరించింది. ఇరాన్లోని అణ్వాయుధాలు, యురేనియంపై అంతర్జాతీయ సంస్థల తనిఖీకి కూడా అంగీకరించింది.
మరోవైపు తీవ్రవాద నిర్మూలనలో కూడా పాలుపంచుకునేందుకు ముందుకొచ్చింది. దీనిలో భాగంగా ఇరాన్ సమీపంలోని దేశాల్లో ఉండే హెజ్బొల్లా, హమాస్, ఇరాకి మిలీషియాస్ వంటి తీవ్రవాద సంస్తలకు నిధులు అందించడం నిలిపివేస్తామని కూడా తెలిపింది. అయితే, ఈ అంశాలన్నింటిపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ, అమెరికాతో చర్చల విషయంలో మధ్యవర్తుల ద్వారా సందేశం పంపినట్లు తెలుస్తోంది. అమెరికా చర్చల ప్రతిపాదనను ఇరాన్ తప్పుబడుతోంది. అమెరికా తనతో తానే చర్చించుకుంటోంది అని ఇరాన్ మిలిటరీ ప్రతినిధి ఎబ్రహిమ్ అన్నారు. అమెరికా కూడా ఇరాన్కు 15 అంశాలతో శాంతి ప్రణాళిక ప్రతిపాదించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలపై ఇంకా ఎలాంటి ముందడుగు పడలేదు.