టోక్యో: ఒక ఓడ రెండు ముక్కలుగా విరిగింది. జపాన్ సముద్ర తీరంలో బుధవారం ఈ ఘటన జరిగింది. పనామా దేశానికి చెందిన కార్గో షిప్ క్రిమ్సన్ పొలారిస్, జపాన్ అమోరిలోని హచినోహె పోర్ట్ చుట్టూ తిరుగుతుండగా రెండు ముక్కలుగా విరిగిపోయింది. దీంతో విరిగిన ఒక భాగం పైకి లేవగా విరిగిన మరో భాగం సముద్రంలో మునుగుతున్నది. అయితే, రవాణా ఓడలోని చైనా, ఫిలిపిన్స్కు చెందిన 21 మంది సిబ్బందిని జపాన్ కోస్ట్ గార్డ్ రక్షించింది. దీని కోసం మూడు పెట్రోలింగ్ బోటులు, మూడు విమానాలను వినియోగించారు.
మరోవైపు విరిగిన కార్గో షిప్ నుంచి ఆయిల్ భారీగా లీక్ అవుతున్నది. సుమారు 24 కిలోమీటర్ల పరిధిలో ఆయిల్ తెట్టు విస్తరించిందని జపాన్ అధికారులు తెలిపారు. పర్యావరణంపై ఎంత ప్రభావం చూపిందో అన్నది ఇంకా స్పష్టం కాలేదని చెప్పారు. ఆయిల్ లీకేజీని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. మరోవైపు ఓడ విరిగిన వైపు ఇతర నౌకలు రాకుండా, విరిగిన ఓడను ఢీకొట్టకుండా ఉండేందుకు బుధవారం రాత్రంతా పెట్రోలింగ్ బోట్లతో పర్యవేక్షించినట్లు అధికారులు వెల్లడించారు.