Shehbaz Sharif : ఇండియాకు, పాకిస్తాన్కు మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఎప్పుడూ ట్రంప్నకు రుణపడి ఉంటుందని, ఆయనకు షెహబాజ్ ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాదు.. ట్రంప్ను ‘మ్యాన్ ఆఫ్ పీస్’ (శాంతి కాముకుడు)గా అభివర్ణించాడు.
అమెరికాకు స్వాతంత్య్రం లభించి 250 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఇస్లామాబాద్లోని అమెరికా రాయబార కార్యాలయం శుక్రవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ గురించి ఈ వ్యాఖ్యలు చేశాడు. గత ఏడాది జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీనికి బదులుగా ఇండియా.. ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాకిస్తాన్పై దాడులకు దిగింది. ఈ దాడుల్ని ప్రభుత్వం తర్వాత నిలిపివేసింది. పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ యుద్ధాన్ని ఆపింది తానేనని ట్రంప్ అనేకసార్లు చెప్పాడు. దీంతో అమెరికా ఒత్తిడికి ఇండియా తలొగ్గిందని అనేక విమర్శలు వచ్చాయి. గత ఏడాది మే 10న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
తాజాగా ఈ అంశంపై పాక్ ప్రధాని మాట్లాడారు. ట్రంప్ సరైన సమయంలో జోక్యం చేసుకుని, ఇండియా దాడుల్ని ఆపారని, రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చారని అన్నారు. అందువల్ల పాకిస్తాన్ అమెరికాకు, ట్రంప్నకు ఎప్పటికీ రుణపడి ఉంటుందని, ఇందుకు ట్రంప్నకు ధన్యవాదాలు అన్నారు. ఆయన జోక్యం వల్ల దక్షిణాసియాలో శాంతి నెలకొందని, మిలియన్ల ప్రజల్ని ఆయన కాపాడారని షెహబాజ్ అన్నారు. అమెరికాకు, పాకిస్తాన్కు మధ్య ప్రత్యేక బంధం ఉందన్నారు.