బీజింగ్: చైనాలో కరోనా కలకలం కొనసాగుతున్నది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆ దేశ ఆర్థిక నగరమైన షాంఘైలో పరిస్థితి దారుణంగా ఉన్నది. దీంతో సామూహిక కరోనా టెస్ట్లు నిర్వహిస్తున్నారు. మార్చి 1 నుంచి 9 వరకు 1,80,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే 96 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేవని ఆ దేశ ఆరోగ్య అధికారులు తెలిపారు.
కాగా, కరోనా హాట్స్పాట్గా ఉన్న షాంఘైలో కరోనాను నియంత్రించేందుకు చైనా అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలో కొత్త క్వారంటైన్ విధానాన్ని అమలు చేస్తున్నది. స్కూళ్లు, కొత్తగా నిర్మించిన అపార్ట్మెంట్ భవనాలు, ఎగ్జిబిషన్ సెంటర్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చింది. కరోనా లక్షణాలు ఉన్నా లేకపోయినా, పాజిటివ్గా నిర్ధారణ అయిన వ్యక్తులను విధిగా ప్రత్యేక ఐసొలేషన్ కేంద్రాల్లో క్వారంటైన్లో ఉంచుతున్నది. అలాగే హోమ్ క్వారంటైన్కు అనుమతించడం లేదు.
పొరుగున ఉన్న ప్రావిన్స్లోని క్వారంటైన్ కేంద్రాలకు కూడా కరోనా రోగులను తరలిస్తున్నారు. పాజిటివ్ పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తున్నారు. కరోనా బారిన పడిన వృద్ధులను వైద్యులు, సిబ్బంది పెద్దగా పట్టించుకోవడం లేదని, వారిని వేరుగా క్వారంటైన్ చేస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో సరైన వైద్యం, మందులు, ఆహారం అందక తమ ఆప్తులు మరణిస్తున్నారని సోషల్ మీడియాలో పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఆరోపణలను చైనా అధికారులు ఖండించారు. కొన్ని వెబ్సైట్లు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని ఆరోపించారు.