బీజింగ్: కరోనా పుట్టిళ్లు చైనాలో మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. దీంతో వైరస్ను నిలువరించడానికి అధికారులు ఎక్కడికక్కడ కఠినంగా ఆంక్షలు అమలుచేస్తున్నారు. ఆర్థిక రాజధాని షాంఘైలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడ గత సోమవారం నుంచి లాక్డౌన్ విధించారు. ఇప్పుడిప్పుడే కొత్తకేసుల సంఖ్య తగ్గుతుండటంతో నగరంలో మరోసారి ఆంక్షలను పొడిగించారు. ఈ మేరుకు స్థానిక ప్రభుత్వం గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆదేశాలు జారీచేసింది.
షాంఘైలో వరుసగా రెండో రోజూ కేసులు తగ్గాయి. గురువారం కొత్తగా 4,144 ఎలాంటి లక్షణాలు లేని కేసులు నమోదయ్యాయని, మరో 358 మందిలో లక్షణాలు గుర్తించామని అధికారులు వెల్లడించారు. ఇది అంతకుముందురోజు 5298గా, 355గా ఉన్నదని తెలిపారు. కాగా, ఎట్టిపరిస్థితుల్లోని ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకూడదని స్పష్టం చేశారు. కరోనా టెస్టులు చేయించుకునేందుకు మాత్రమే బయటకు అనుమతిస్తామన్నారు. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రజలు తమ ఇండ్ల పరిధిలోని ఓపెన్ ఏరియాల్లో కూడా నడవకూడదని ఆరోగ్యశాఖ అధికారి చెప్పారు.