భూమిని తవ్వి బొగ్గు తీస్తున్నాం.. సముద్రాన్ని తోడి పెట్రోల్ పీల్చేస్తున్నాం.. కావాల్సినంత వాడుకొని, మసి చేసి గాలిలో వదిలేస్తున్నాం.. ఓజోన్ పొరను ఛిద్రం చేస్తూ.. మనకు మనమే సూర్యుడి ప్రతాపాన్ని పెంచేస్తున్నాం. భూమండలం అగ్నిగోళంలా మారేందుకు చేయాల్సినంత తప్పు చేస్తున్నాం. భూతాపాన్ని పెంచి ఎన్నో జీవాలనూ పొట్టనపెట్టుకొంటున్నాం. భూమ్మీద ఇంకో 1.5 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగితేనా? మన ముందు తరాలు ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవటం తప్పనిసరి. అయితే, ఉన్నఫలంగా ఉష్ణోగ్రతను తగ్గించే ఉపాయం తమ వద్ద ఉందని అంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు. సూర్యుడి నుంచి వెలువడే ఉష్ణం భూమ్మీద పడకుండా ఉండేందుకు వాతావరణంలోకి ప్రత్యేకమైన రసాయనాలు చల్లితే సరి అని చెప్తున్నారు. సూర్యరశ్మి తీవ్రతను ఈ రసాయనాలు అడ్డుకొని, పరావర్తనం చెందిస్తాయని వివరించారు. తద్వారా భూతాపానికి, వడగాడ్పులకు అడ్డుకట్ట వేయవచ్చని వెల్లడించారు. ఈ రసాయనాలు చల్లేందుకు ప్రత్యేక విమానాలు, ఏటా వందల కోట్లలోనే ఖర్చు అవుతుందని పేర్కొన్నారు.
భూ తాపాన్ని ఎందుకు తగ్గించాలి?
చమురు, బొగ్గు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాల వినియోగంతో గాల్లోకి కార్బన్డయాక్సైడ్ విడుదలై, వేడి, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాల్లో భూతాపం అంతకంతకూ పెరుగుతున్నది. అంటార్కిటికా ఖండంలో మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. భూభాగం సముద్రంలో కలిసిపోతున్నది. 2030లోగా ప్రపంచ దేశాలన్నీ శిలాజ ఇంధనాల వినియోగాన్ని 45 శాతానికి తగ్గించాలి. లేకపోతే ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు పెరిగి వడగాడ్పులు పెరుగుతాయి. కరువు, వరదలు సంభవిస్తాయి. పంటలు పండవు. నీటి వనరులు తగ్గిపోతాయి. ఆకలి కేకలతో వలసలు పెరిగి ఉత్పాతానికి దారి తీస్తాయి. ఊహించని విధంగా ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడుతుంది.
శాస్త్రవేత్తల భిన్నాభిప్రాయాలు
ఉన్నఫలంగా భూతాపాన్ని తగ్గించేందుకు ఈ సాంకేతికత ఉపయోగంగానే ఉన్నా, భవిష్యత్తులో సంభవించే పరిణామాల పరిస్థితి ఏమిటని కొందరు శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిశోధనలు వెంటనే ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. రసాయనాల వాడకంతో వాతావరణంలో, వర్షపాతంలో మార్పులు వస్తాయని తెలిపారు. ఈ పద్ధతి సమస్యను దాచి ఉంచినట్టే అవుతుంది తప్ప, పరిష్కారం కాదని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ దీన్ని వినియోగించి, తర్వాత ఆపే స్తే? అప్పుడు జరిగే పరిణామాలను ఊహించటం కష్టమని చెప్తున్నారు. ఒక విధంగా ఈ రసాయనాలు కూడా వాతావరణాన్ని కలుషితం చేసేవేనని పేర్కొంటున్నారు. అదీకాకుండా.. ఎలాగూ సూర్యరశ్మిని నియంత్రించే రసాయనాలు ఉన్నాయని, ప్రపంచ దేశాలు శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా వినియోగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూతాపాన్ని తగ్గించేందుకు ఎన్నో మార్గా లు ఉన్నాయని, పునరుత్పాదక వనరుల వినియోగాన్ని పెంచి వాటిని సక్రమంగా వాడుకొంటే ఈ సాంకేతికత అవసరం లేదని అంటున్నారు.
గతంలోనూ ఆలోచనలు..
భూతాపాన్ని తగ్గించడంలో భాగంగా సూర్యుడి కిరణాలను దుమ్ము-ధూళితో అడ్డుకునేందుకు గతంలో కూడా ప్రయోగాలు జరిగాయి. మైక్రోసాఫ్ట్ సహవ్యస్థాపకుడు బిల్గేట్స్ మూడేండ్ల క్రితం ఈ మిషన్పై ఆసక్తి కనబరిచారు. భూ ఉపరితలానికి 12 మైళ్ల ఎత్తున ఉండే స్ట్రాటోస్పియర్లో రోజూ 800 భారీ విమానాలతో కోట్లాది టన్నుల సుద్దముక్కల కణాలను విడుదల చేయాలని ప్రణాళికలు వేశారు. అయితే, ఇది కార్యరూపం దాల్చలేదు.
దూసుకొస్తున్న సౌరజ్వాలలు
నేడు భూమిని తాకే అవకాశం
సూర్యుడి నుంచి సమాచార ఉపగ్రహాలు, జీపీఎస్ వ్యవస్థలను దెబ్బతీసే సౌర జ్వాలలు వెలువడ్డాయని, అవి భూమి వైపు దూసుకొస్తున్నాయని నాసా వెల్లడించింది. జూన్ 14న ఈ జ్వాల వెలువడిందని, పాము ఆకారంలో ఉన్న ఈ జ్వాల మంగళవారం (జూలై 19న) భూ వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నదని తెలిపింది. ఈ జ్వాల వల్ల కమ్యూనికేషన్ వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడవచ్చని, ఉపగ్రహా లు, జీపీఎస్, విద్యుత్తు గ్రిడ్ పనితీరులో లోపా లు ఏర్పడుతాయని, ఎయిర్లైన్ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉన్నదని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా రేడియో బ్లాక్అవుట్ పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఇది ఎక్స్ తరగతికి చెందిన జ్వాలగా నాసా గుర్తించింది.
సౌర జ్వాల అంటే..
సూర్యుడి ఉపరితలంపై బలమైన విద్యుదయస్కాంత విస్పోటనాలు ఏర్పడుతుంటాయి. విస్పోటన శక్తిని బట్టి ఈ జ్వాలలను ఏ, బీ, సీ, ఎం, ఎక్స్ తరగతులుగా వర్గీకరిస్తారు. ఎక్స్ తరగతి సౌర జ్వాలలు అత్యంత శక్తిమంతమైనవి. ప్రస్తుతం వెలువడ్డ జ్వాల ఈ తరగతికి చెందినదే. ఈ జ్వాలలు కొన్ని వేల కోట్ల అణుబాంబుల శక్తికి సమానం.