కొలంబో : ఏడు దశాబ్దాల తర్వాత అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న శ్రీలంకలో ఇంధన కొరత తీవ్రమైంది. ఇంధన కోసం పెద్ద సంఖ్యలో జనం బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో సోమవారం శ్రీలంక దళాలు సోమవారం టోకెన్లు పంపిణీ చేశాయి. అయితే, రాజధాని కొలంబోలో పాఠశాలలు మూతపడ్డాయి. మరో వైపు ప్రభుత్వ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో తగ్గిపోవడంతో 22 మిలియన్ల మంది జనాభా ఉన్న ద్వీప దేశంలో ఆహారం, మెడిసిన్స్, ఇంధన దిగుమతుల కోసం చెల్లింపులు చేసేందుకు తీవ్ర ఇబ్బందులుపడుతున్నది.
రోజుల తరబడిగా పెట్రోల్ కోసం క్యూలైన్లో ఉన్నామని, ఈ సమయంలో సరిగా భోజనం చేయడం లేదని, నిద్ర కూడా పోవడం లేదని ఓ ఆటో డ్రైవర్ వాపోయాడు. క్యూ ఎప్పుడు వస్తుందో ? దొరుకుతుందో లేదోనని మరో వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. తాము కుటుంబాలను పోషించలేకపోతున్నామని, ఇంటికి వెళ్లేందుకు సైతం పెట్రోల్ లేక ఇబ్బందిపడుతున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం లంకలో ఇంధన నిల్వలు ఎంత ఉన్నాయనేది స్పష్టంగా తెలియరాలేదు. కొలంబో చుట్టు పక్కల ప్రాంతాల్లో పాఠశాలలను వారం పాటు మూసివేయగా.. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఇంటి నుంచే పని చేయాలని ప్రభుత్వం ఉద్యోగలను ఆదేశించింది.
గతవారం రోజుల నుంచి పెట్రోల్ బంకుల్లో బారులు పెరిగాయని, ఈ సమస్య ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజారవాణా, విద్యుత్ ఉత్పత్తి, వైద్యసేవలు, పోర్టులు, విమానాశ్రయాలకు ఇంధన పంపిణీలో అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదిలా ఉండగా.. మూడు బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీపై చర్చించేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధికి చెందిన బృందం శ్రీలంకను సందర్శిస్తున్నది. బృందంతో ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నప్పటికీ.. అతి తక్షణమే నిధులను విడుదల చేసే అవకాశం లేదని తెలుస్తున్నది.