Schengen Visa | ఐరోపా పర్యటనకు వెళ్లాలనుకునే వారికి ప్రయాణ ఖర్చు మరింత భారం కానుంది. ఇందుకు కారణంగా షెన్జెన్ వీసా (Schengen Visa) ఫీజును పెంచడమే. ప్రపంచ వ్యాప్తంగా షెన్జెన్ వీసా ఫీజును 12 శాతం పెంచాలన్న ప్రతిపాదనను యూరోపియన్ కమిషన్ ఆమోదం తెలిపింది. స్లొవేనియా విదేశాంగ, యూరోపియన్ వ్యవహారాల శాఖ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. జూన్ 11వ తేదీ నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఈ పెంపు అమల్లోకి రానుంది. ఇప్పటి వరకూ పెద్దలకు షెన్జెన్ వీసా దరఖాస్తు రుసుం 80 యూరోలు ఉండగా… ఇప్పుడు దాన్ని 90 యూరోలకు పెంచారు. ఇక 6-12 ఏండ్లలోపు పిల్లల వీసా ఫీజు 40 నుంచి 45 యూరోలకు చేశారు. ద్రవ్యోల్బణం, ఉద్యోగుల వేతనాల పెంపు తదితర కారణాలతో ఈ వీసా రుసుంను పెంచినట్లు యూరోపియన్ కమిషన్ (European Commission ) తెలిపింది.
అయితే యూరోపియన్ కమిషన్ నిర్ణయంతో భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే యూరప్కు వీసా దరఖాస్తుల్లో మన దేశం మూడో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో తాజా రుసుం పెంపు ప్రభావం భారతీయులపైనే ఎక్కువగా ఉండనుంది. ఇక చివరిసారిగా ఈ వీసా ధరలను 2020 ఫిబ్రవరిలో పెంచారు. అప్పుడు 60 యూరోలు ఉన్న దరఖాస్తు ఫీజు 80 యూరోలకు చేశారు.
షెన్జెన్ అంటే..?
షెన్జెన్ అంటే 29 ఐరోపా దేశాల సమాఖ్య. 90 రోజుల వరకూ ఆయా దేశాల్లో పర్యటించేందుకు వీలుగా షెన్జన్ వీసాలను జారీ చేస్తుంటారు. 29 దేశాల్లో ఏ దేశం ఈ వీసాను జారీ చేసినా.. దానిపై ఇతర దేశాల్లోనూ పర్యటించే అవకాశం ఉంటుంది. ఇటలీ, ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, క్రొయేషియా, డెన్మార్క్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, జర్మనీ, హంగేరీ, గ్రీస్, ఐస్లాండ్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రొమానియా, స్లొవాకియా, స్లొవేనియా, స్వీడన్, స్పెయిన్ తదితర దేశాలు ఈ కోవలోకి వస్తాయి.
Also Read..
Sania Mirza | ఇంటి నేమ్ప్లేట్ మార్చేసిన సానియా మీర్జా.. ఎవరి పేరు యాడ్ చేసిందంటే..?
Anant Weds Radhika | ఇటలీ టు స్విట్జర్లాండ్.. భారీ క్రూయిజ్లో అనంత్ వివాహం