భువనేశ్వర్: పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలకు ఒడిశా అసెంబ్లీ స్పీకర్ తాఖీదులిచ్చారు (Showcause Notice). అధికార బిజూ జనతాదల్ (BJD)కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సమీర్ రంజన్ దాస్, సీమారాణి నాయక్, పరశురామ్ ధోడా, రమేశ్ చంద్ర సాయి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ప్రభుత్వ విప్ ఫిర్యాదు మేరకు వారికి అసెంబ్లీ కార్యదర్శి షోకాజ్ నోటీసులిచ్చారు. ఈ నెల 27లోపు అనర్హత వేటు ఎందుకు వేయకూడదో వివరణ ఇవ్వాలని అందులో స్పష్టం చేశారు.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వ చీఫ్ విప్ ప్రశాంత కుమార్ ముదులి దాఖలు చేసిన పిటిషన్పై స్పీకర్ విచారణ చేపట్టారు. విచారణను పురస్కరించుకుని పూర్వాపరాలు పరిశీలించిన మేరకు స్పీకర్ జారీచేసిన ఆదేశాల ఆధారంగా శాసన సభ కార్యదర్శి నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలకు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గతంలో బీజేడీ నుంచి బీజేపీలో చేరిన అరబింద ఢాలీ, ప్రేమానంద నాయక్లపై స్పీకర్ ప్రమీలా మల్లిక్ అనర్హత వేటు వేశారు.
4 MLAs in Odisha have been issued showcause notice by the State Assembly after they switched parties from BJD to BJP. They have been asked to reply by May 27 pic.twitter.com/wNQzeHpq3z
— ANI (@ANI) May 22, 2024