కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ గత రెండు దశాబ్దాల్లో ఎన్నో ఆత్మాహుతి దాడులను చూసింది. 20 ఏళ్ల కిందట తాలిబన్లు అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటి వరకూ ఎన్నో హింసాత్మక ఘటనలు జరిగాయి. కానీ గురువారం జరిగిన ఆత్మాహుతి దాడి( Kabul Blasts ) మాత్రం పెను విషాదాన్ని మిగిల్చింది. తాలిబన్ల బారి నుంచి తప్పించుకొని ఇల్లూవాకిలి వదిలి వేరే దేశాలకు వెళ్లిపోవడానికి ఎదురు చూస్తున్న వాళ్లు లక్ష్యంగా ఈ దాడి జరగడం మహా విషాదం. అమెరికా మిలిటరీ కూడా గత పదేళ్లలో ఎన్నడూ చూడని ఉగ్రదాడి ఇది. అయితే ఈ దారుణాన్ని ప్రత్యక్షంగా చూసిన ఓ వ్యక్తి.. ఆ భయానక దృశ్యాల గురించి వివరించారు.
టోర్నడోలో చిత్తు కాగితాలలాగా..
ఆ వ్యక్తి అమెరికా ప్రత్యేక ఇమ్మిగ్రెంట్ వీసా కలిగి ఉన్న అధికారి. గతంలో ఓ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ గ్రూప్లో పని చేశారు. ఆఫ్ఘనిస్థాన్ వదిలి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న వేల మందిలాగే ఆ వ్యక్తి కూడా కాబూల్ నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పటిలాగే గురువారం ఉదయమే కాబూల్ ఎయిర్పోర్ట్కు వచ్చి వేల మంది ఉన్న వరుసలో నిల్చున్నారు. పది గంటల పాటు అలా వేచి చూసిన తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో ఈ భారీ పేలుళ్లు జరిగాయి.
ఆ పేలుడు తర్వాత నా కాళ్ల కింద భూమిని ఎవరో లాగేసినట్లు అనిపించింది. నా కర్ణభేరి పగిలిపోయిందా అనుకున్నాను. కొంతసేపు ఏమీ వినిపించలేదు. శరీర భాగాలు టోర్నడోలో చిత్తు కాగితాలలాగే గాల్లోకి ఎగిరాయి. మృతదేహాలు, శరీర భాగాలు, తీవ్రంగా గాయపడి సాయం కోసం వేడుకుంటున్న మహిళలు, పిల్లలు, వృద్ధులతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. నా జీవితంలో యుగాంతాన్ని చూస్తానో లేదో కానీ.. ఇవాళ అలాంటిదే చూశాను అని ఆ వ్యక్తి జరిగిన దారుణాన్ని వివరించారు.
రక్తం ఏరులై పారింది
గత ఆఫ్ఘన్ ప్రభుత్వంలో హయాంలో ఉన్న వ్యక్తి కావడంతో తాలిబన్లకు భయపడిన తన పేరు చెప్పడానికి నిరాకరించారు. పేలుడు తర్వాత మృతదేహాలను అక్కడి నుంచి తరలించడానికి, గాయపడిన వారిని హాస్పిటల్స్కు తీసుకెళ్లడానికి ఎవరూ లేరు. అలా రోడ్డుపైన, పక్కనే ఉన్న మురికి కాలువలో పడి ఉన్నారు. ఆ కాలువలో నీళ్లకు బదులు రక్తం పారుతోందా అనిపించింది. శారీరకంగా నేను బాగానే ఉన్నాను. కానీ ఈ పేలుడు చూసిన తర్వాత మానసికంగా నా జీవితం బాగుంటుందా లేదా అన్నది మాత్రం తెలియడం లేదు అని ఆ ప్రత్యక్ష సాక్షి అన్నారు.