చైనాతో భారత్ సమస్యలు ఎదుర్కొంటోందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం చైనాతో భారత్ సంబంధాలు చాలా విపత్కర పరిస్థితుల్లోనే ఉన్నాయని మరోసారి తెలిపారు. గతంలో కూడా జైశంకర్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మునిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 45 సంవత్సరాలుగా ఎలాంటి సరిహద్దు సమస్యలూ లేవని, సరిహద్దు వ్యవస్థ అనేది సరిగ్గానే వుందని, 1975 నుంచి సరిహద్దుల్లో సైనిక మరణాలు కూడా లేవని జైశంకర్ తెలిపారు. ఇప్పుడు పరిస్థితి మారిందని.. ఎందుకంటే కుదుర్చుకున్న ఒప్పందాలను చైనా తుంగలో తొక్కేసిందని విరుచుకుపడ్డారు.
సరిహద్దుల్లో పరిస్థితి ఎలా వుంటే.. ఇరు దేశాల మధ్య సంబంధాల పరిస్థితి కూడా అలాగే వుంటుందని, అందులో పెద్ద మార్పేమీ ఉందని, ఇది సహజ స్థితేనని జైశంకర్ చైనాకు చురకలంటించారు. ఈ కారణాల రీత్యానే ప్రస్తుతం చైనాతో భారత సంబంధాలు క్లిష్ట పరిస్థితుల్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. సరిహద్దుల్లోకి ఒక్కసారిగా భారీ సంఖ్యలో బలగాల మోహరింపు చేయకూడదని చైనాతో ఒప్పందం ఉందని, చైనా దానిని పక్కకు పెట్టి, భారీ సంఖ్యలో బలగాలను మోహరించిందని, అందుకే ఎల్ఏసీ వెంబడి అంత స్థాయిలో ఉద్రిక్తతలు తలెత్తాయని ఆయన వివరించారు. అంత పెద్ద దేశమే ఒప్పందాలను తుంగలో తొక్కేస్తే.. అంతర్జాతీయ సమాజం దీనిపై దృష్టి సారించాల్సిందేనని జైశంకర్ స్పష్టం చేశారు.