కీవ్, డిసెంబర్ 24: దక్షిణ ఉక్రెయిన్లోని ఖేర్సన్ నగరంపై రష్యన్ బలగాలు శనివారం షెల్స్ దాడులతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో 10 మంది సాధారణ పౌరులు మరణించగా, 55 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఆరేండ్ల బాలుడితో సహా 18 మంది పరిస్థితి విషమంగా ఉన్నదని ఖేర్సన్ రీజియన్ గవర్నర్ యరోస్లావ్ పేర్కొన్నారు. షెల్స్ దాడిలో పలు భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఖేర్సన్ నగరం నుంచి గత నెలలో రష్యా బలగాలు వెనక్కు వెళ్లిన విషయం తెలిసిందే. దాడులకు సంబంధించిన ఫొటోలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకొన్నారు. ఉక్రేనియన్లు క్రిస్మస్ సంబరాలు జరుపుకొంటున్న వేళ.. ఈ దాడులు చోటుచేసుకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.