మాస్కో, ఫిబ్రవరి 16: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బద్ధ విరోధి, ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ శుక్రవారం అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. రష్యాలో అధికారుల అవినీతిపై ఉద్యమించిన 47 ఏండ్ల నావల్నీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఆందోళనలు నిర్వహించారు. తీవ్రవాదిగా ముద్రపడి 19 ఏండ్ల జైలుశిక్షకు గురైన నావల్నీ ఉదయం వాహ్యాళికి వెళ్లి కిందపడిపోయాడని, వెంటనే కోమాలోకి వెళ్లిపోయాడని జైలు అధికారులు చెప్పారు. అంబులెన్స్లో అతడిని వెంటనే దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందాడని పేర్కొన్నారు. ఇంతకుముందు కూడా నావల్నీపై విషప్రయోగం జరుగగా, జర్మనీ వెళ్లి చికిత్స తీసుకున్నారు. జర్మనీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే 2021లో అతడిని అరెస్టుచేసి జైలుకు పంపారు.రష్యాలో రాజకీయ ప్రత్యర్థులు తమ అంతర్గత గొడవల్లో కనుమరుగు కావడమో లేదా జైలు పాలు కావడమో లేదా ప్రవాసం వెళ్లిపోవడమో లేదా ఇలా మృత్యువాత పడటం సర్వసాధారణమేనని ఆ దేశపు వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి.
అసలు నావల్నీ మరణించినట్టు తమకు అధికారికంగా సమాచారం లేదన్న నావల్నీ సహచరులు.. ఆయన నిజంగా చనిపోయినట్లయితే 24 గంటల్లో మృతుడి బంధువులకు ఎందుకు తెలియచేయలేదని ప్రశ్నించారు. నావల్నీపై పుతిన్ గతంలోనే చాలా రకాలుగా హింసించాడని పేర్కొంటూ నావల్నీ అకాల మరణానికి పుతినే బాధ్యత వహించాలని రష్యాకు చెందిన వ్యాపారవేత్త మిఖాయిల్ ఖోడోర్కోవ్సీ అన్నారు. నావల్నీ మృతి నిజమైతే ఇది కచ్చితంగా పుతిన్ చేయించిన హత్యేనని ప్రతిపక్ష నాయకుడు డిమిత్రి గుడ్కోప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పుతిన్, అతని మాఫియా గుట్టు బయటపెట్టినందుకే నావల్నీ చంపారని విదేశాల్లో నివసిస్తున్న చెస్ క్రీడాకారుడు కాస్పరోవ్ పేర్కొన్నారు.
నావల్నీ అనుమానాస్పద మృతిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ ఇది ముమ్మాటికీ పుతిన్ చేయించిన హత్య అని ఆరోపించారు. పుతిన్ తన పదవి కోసం దేనికైనా తెగిస్తాడని విమర్శించారు. జర్మన్ ఛాన్సలర్ ఓలాప్ స్కోల్జ్ స్పందిస్తూ నావల్నీ మరణం పుతిన్ పాలన ఎలాంటిదో స్పష్టం చేస్తున్నదని అన్నారు. నావల్నీని క్రెమ్లిన్ దారుణంగా హత్య చేసిందని లాట్వియన్ ప్రెసిడెంట్ ఎగ్గార్గ్ రింకెవిక్స్ ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సుల్లివన్ మాట్లాడుతూ నావల్నీ మరణం ధృవీకరణైతే .. ఇదొక భయంకరమైన విషాదంగా నిలిచిపోతుందన్నారు.
రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ గతేడాది ఆగస్ట్లో విమాన ప్రమాదంలో చనిపోయారు. 2022లో భారత్లోని రాయగడలోని ఒక హోటల్లో రష్యా ఎంపీ పావెల్ ఆంటోవ్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. 2022లో 22 మంది రష్యన్ ప్రముఖులు చనిపోయారు. వీరిలో కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే వీరందరి మరణాలకు పుతిన్ కారణమని కొన్ని మీడియా సంస్థలు అనుమానం వ్యక్తం చేశాయి. తనను విమర్శించే, ఎదిరించేవారిని పథకం ప్రకారం నామరూపాల్లేకుండా చేస్తాడని పుతిన్పై బలమైన ఆరోపణలున్నాయి.
నావల్నీ న్యాయవాది వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. బ్లాగ్ ద్వారా ప్రభుత్వ ఉన్నతాధికారుల అవినీతిని బయటపెట్టారు. 2018లో పుతిన్కు వ్యతిరేకంగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆయనపై అనర్హత వేటు వేయడం ద్వారా అడ్డుకున్నారు. తనపై జరిగిన విష ప్రయోగానికి చికిత్స కోసం 2021లో జర్మనీ వెళ్లారు. చికిత్స తర్వాత రష్యాకు తిరిగి రాగా, ఎయిర్పోర్టులోనే అరెస్ట్ చేశారు. నిధుల దుర్వినియోగం సహా వివిధ కేసుల్లో ఆయనకు 19 ఏండ్ల జైలు శిక్ష పడింది. ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకుని కెనడా దర్శకుడు రోహెర్.. నావల్నీ పేరుతో ఓ డాక్యుమెంటరీ తీశారు.