US to India | రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతి చేసుకుంటుందన్న వార్తలపై అమెరికా తీవ్రంగా ప్రతిస్పందించింది. రాయితీ ధరకు రష్యా ముడి చమురు కొనుగోలు చేయడం ద్వారా అమెరికా విధించిన ఆంక్షలను భారత్ ఉల్లంఘించొద్దని వ్యాఖ్యానించింది. అదే జరిగితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ చరిత్రలో తప్పుడు నిర్ణయంగా నిలుస్తుందని హెచ్చరించింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా ముడి చమురును దిగుమతి చేసుకోకుండా ప్రపంచ దేశాలపై అమెరికా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. రష్యాపై విధించిన నిషేధాన్ని అన్ని దేశాలు పాటించాలని వైట్హౌస్ ప్రెస్ కార్యదర్శి జెన్ సాకీ పేర్కొన్నారు.
`ఈ నిషేధాజ్ఞల్ని భారత్ ఉల్లంఘిస్తుందని నేను భావించట్లేదు. ఎటువైపు మీరు నిలుస్తారో ఆలోచించుకోండి. రష్యాకు, రష్యా నాయకత్వానికి మద్దతు తెలపడం తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్న రష్యా దండయాత్రకు మద్దతు ఇవ్వడమే. ఇది చరిత్ర పుటల్లో రాయబడుతుంది` అని జెన్ సాకీ చెప్పారు. ఉక్రెయిన్పై రష్యా దండయాత్రను భారత్ ఖండించలేదు. రష్యా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితిలో పెట్టిన తీర్మానంపై ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. రష్యాకు భారత్ దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు ఇటీవలే అమెరికా పదేపదే చెబుతున్నది.
కానీ ఆయుధాలు, మందుగుండు సామగ్రి మొదలు క్షిపణుల నుంచి యుద్ధ విమానాల వరకు రష్యాపై భారత్ భారీగా ఆధారపడుతున్నది. భారత్కు ముడి చమురు, ఆయిల్ ఉత్పత్తుల ఎగుమతులు పెంచనున్నట్లు కేంద్ర చమురుశాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీతో గతవారం రష్యా డిప్యూటీ ప్రధాని అలెగ్జాండర్ నొవాక్ చెప్పారు. రష్యా చమురు రంగంలో భారత్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని కూడా అన్నారు.