మాస్కో : ఉక్రెయిన్ సంక్షోభానికి పరిష్కారం లభిస్తుందనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్రోవ్ పేర్కొన్నారు. రష్యా ప్రాధమిక డిమాండ్లనే ముందుంచిందని చెప్పారు. దేశ భద్రతకు సవాల్ విసిరేందుకు ఉక్రెయిన్ను రష్యా అనుమతించబోదని స్పష్టం చేశారు. రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధి బృందాల మధ్య తదుపరి దశ చర్చలు గురువారం సాయంత్రం జరుగుతాయని తెలిపారు.ఉక్రెయిన్, యూరప్ ప్రాంతానికి భద్రతా హామీలపై చర్చించేందుకు రష్యా సిద్ధంగా ఉందని అన్నారు. పాశ్చాత్య నేతలు అణు యుద్ధంపై చర్చిస్తున్నారని అయితే ఇలాంటి ఆలోచనలు రష్యన్లలో లేవని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరం కావడంతో ఎస్-400 మిసైల్స్ను రంగంలోకి దించేందుకు రష్యా కసరత్తు ముమ్మరం చేసింది.
ఎస్-400 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్స్ సిబ్బంది నొవొసిబిర్క్ ప్రాంతంలో శత్రు లక్ష్యాలను ఛేదించేందుకు శిక్షణ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాయి. ఇక గురువారం రష్యా-ఉక్రెయిన్ వార్ ఎనిమిదో రోజుకు చేరింది. రష్యా దురాక్రమణ మొదలైనప్పటి నుంచి దాదాపు 2000 మందికి పైగా పౌరులు మరణించారని ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వేసుల విభాగం వెల్లడించింది. మరోవైపు ఉక్రెయిన్ నుంచి రష్యన్ సేనల ఉపసంహరణకు అనుకూలంగా ఐక్యరాజ్యసమితి బుధవారం ఓటు చేసింది.
ఉక్రెయిన్లో రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్పై రష్యన్ బాంబుల మోత కొనసాగుతుండటంతో నగరాన్ని తక్షణమే భారతీయులందరూ ఖాళీ చేయాలని ఇండియన్ ఎంబసీ కోరింది.కాగా, ఉక్రెయిన్పై దాడులతో విరుచుకుపడుతున్న పుతిన్ను యుద్ధ నేరస్తుడిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అభివర్ణించారు. పౌర స్ధావరాలపై రష్యా బాంబులు కురిపిస్తున్న క్రమంలో పుతిన్పై ఆయన మండిపడ్డారు. ఉక్రెయిన్పై దాడిని ఆపాలని చర్చలు పునరుద్ధరించాలని పాశ్చాత్య దేశాలు డిమాండ్ చేస్తుండగా రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రధాన నగరాల్లో రష్యన్ సేనలు కాల్పులతో విరుచుకుపడుతున్నాయి.