ఉక్రెయిన్పై విరుచుకుపడటానికి రష్యా దండు బయల్దేరింది. రాజధాని కీవ్ మీద ముప్పేటదాడి చేయడానికి వేలాది యుద్ధ ట్యాంకులు దూసుకెళ్తున్నాయి. యుద్ధం ప్రారంభించి ఆరు రోజులైనా.. ఏ మాత్రం లొంగకుండా వీరోచితంగా పోరాడుతున్న కీవ్ నగరంలోని ఉక్రెయిన్ సైనికులపై ఒక్కసారిగా దాడిచేసి నగరాన్ని హస్తగతం చేసుకోవాలని పుతిన్ భావిస్తున్నారు.
65 కిలోమీటర్ల మేర వేలాది యుద్ధ ట్యాంకులు, భారీ ఆయుధాలతో కూడిన రష్యా మిలిటరీ కాన్వాయ్ ప్రపంచాన్ని భయపెడుతున్నది. రష్యా యుద్ధ కాన్వాయ్ నగరాన్ని సమీపిస్తున్న తరుణంలో భారతీయులందరూ కీవ్ నగరాన్ని వెంటనే విడిచివెళ్లిపోవాలని అక్కడి రాయబార కార్యాలయం హెచ్చరించింది. అందుబాటులో ఉన్న రైళ్లు, ఇతర రవాణా సదుపాయాల ద్వారా వెళ్లిపోవాలని సూచించింది.
మరోవైపు, రెండో అతిపెద్ద నగరమైన ఖార్కీవ్లో రష్యా సైన్యం దాడులను ఉద్ధృతం చేసింది. జనావాసాలను కూడా లక్ష్యంగా చేసుకొని బాంబులను వేస్తున్నది. ఇక్కడి ప్రాణ నష్టం అంచనాలకు అందడం లేదు. ఒఖ్తిర్కా నగరంలోని మిలిటరీ ఎయిర్బేస్పై రష్యా జరిపిన క్షిపణి దాడుల్లో 70 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు. ఇదిలాఉండగా తొలిదఫా చర్చలు విఫలమైన నేపథ్యంలో బుధవారం రెండోసారి భేటీ కావాలని రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు నిర్ణయించినట్టు రష్యా న్యూస్ ఏజెన్సీ టీఎఎస్ఎస్ వెల్లడించింది. ఐరోపాసమాఖ్య(ఈయూ)లో చేరేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పెట్టుకున్న దరఖాస్తును ఈయూ పార్లమెంట్ మంగళవారం ఆమోదించింది. ఇందుకు సంబంధించిన ప్రత్యేక ప్రక్రియను ప్రారంభించింది.
కీవ్, మార్చి 1: ఉక్రెయిన్పై దండుయాత్రకు రష్యా బయల్దేరింది. యుద్ధం ప్రారంభమై ఆరు రోజులైనా లొంగిపోకుండా ప్రతిఘటిస్తున్న కీవ్ వైపునకు వేలాది యుద్ధ ట్యాంకులను పంపిస్తున్నది. 65 కిలోమీటర్ల పొడవున యుద్ధ ట్యాంకులు బారులు తీరాయి. భారీ ఆయుధాలతో కూడిన వాహనాల కాన్వాయ్ ప్రపంచాన్ని భయపెడుతున్నది. బుధవారం ఈ కాన్వాయ్ కీవ్లో ప్రవేశించి విధ్వంసం సృష్టించవచ్చని భావిస్తున్నారు. కాన్వాయ్ చిత్రాలను మ్యాక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసింది. ఉక్రెయిన్ ఆక్రమణకు రష్యా దాడులు ప్రారంభించి ఆరు రోజులు గడిచింది. తేలిగ్గా లొంగిపోతుందనుకొన్న ఉక్రెయిన్ శక్తికి మించి పోరాడుతున్నది. రష్యాను ముచ్చెమటలు కక్కిస్తున్నది. ఉక్రెయిన్ను భయపెట్టడానికి పుతిన్ న్యూక్లియర్ హెచ్చరికలు కూడా చేసినా పరిస్థితి మారలేదు. రష్యా అంతకంతకూ నష్టపోతూనే ఉన్నది. ఈ నేపథ్యంలోనే కీవ్ నగరంపై ఒక్కసారిగా విరుచుకుపడి హస్తగతం చేసుకోవాలని పుతిన్ భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం అదనపు బలగాలను కూడా పంపించారు. మంగళవారం రాత్రి కీవ్లోనీ ప్రధాన టీవీ టవర్ను రష్యా బలగాలు పేల్చివేశాయి. దీంతో వార్తా ప్రసారాలు నిలిచిపోయాయి. కీవ్లో సైనికులతో పాటు జనావాసాలపై కూడా రష్యా దాడులు చేస్తున్నది. ప్రజలు భయంతో పారిపోతున్నారు.
ఎన్నటికీ మరువం
ఖార్కీవ్ నగరంపై రష్యా దాడులను కొనసాగిస్తూనే ఉన్నది. మంగళవారం ఖార్కీవ్ నగర పరిపాలనా భవనం ఫ్రీడమ్ స్కేర్తో పాటు జనావాసాలపైనా రష్యా బాంబులు వేసిందని అధికారులు పేర్కొన్నారు. ఖార్కీవ్లో అంచనాలకు అందని ప్రాణనష్టం జరుగుతున్నది. ఫ్రీడమ్ స్కేర్పై దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్రంగా ఖండించారు. ‘ఎవరూ దీన్ని క్షమించరు. ఎన్నటికీ మర్చిపోం’ అన్నారు. ఒఖ్తిర్కాలోని ఉక్రెయిన్ సైనిక స్థావరంపై చేసిన దాడుల్లో 70 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు.
మీతో సమానం అని నిరూపించాం
మంగళవారం జెలెన్స్కీ యూరోపియన్ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఐరోపా దేశాలకు ఉన్న శక్తిసామర్థ్యాలు ఉక్రెయిన్కు ఉన్నాయని మేం నిరూపించాం. మీతో సమానంగా మేం పోరాడుతున్నాం. ఈయూలో సభ్యత్వం కోసం ఉక్రెయిన్కు అన్ని అర్హతలు ఉన్నాయి’ అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ ఎప్పటికీ తలవంచబోదని స్పష్టం చేశారు. జెలెన్స్కీ ప్రసంగంపై ప్రశంసల జల్లు కురిసింది. ఈయూ ప్రతినిధులు నిలబడి చప్పట్లు కొట్టి జెలెన్స్కీని అభినందించారు.
జెలెన్స్కీని చంపడానికి కుట్ర!
రష్యా ప్రైవేటు మిలిటరీ కంపెనీ వాగ్నర్ గ్రూప్నకు చెందిన కిరాయి సైనికులు కీవ్కు చేరుకొన్నారని, రష్యా ఆదేశాలతో వారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని చంపడానికి వెళ్లారని యూకేకు చెందిన ఓ వార్తాసంస్థ వెల్లడించింది. ఈ కిరాయి సైనికులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఈయూ ఇటీవల ఆంక్షలు విధించింది. ఈ గ్రూప్ రష్యా కోసం వివిధ దేశాల్లో దాడులకు పాల్పడుతుందని ఆరోపణలు ఉన్నాయి. అయితే, రష్యా ఈ ఆరోపణలను ఖండిస్తూ వస్తున్నది. కానీ, సిరియాలో రష్యా తరఫున బషర్ అల్ అసద్కు మద్దతుగా ఈ కిరాయి సైన్యం పోరాడింది. 2014 నుంచి ఉక్రెయిన్లోని డోన్బాస్లోనూ పనిచేస్తున్నది.
ఫ్రీడమ్ స్కేర్ భవనంపై దూసుకెళ్తున్న క్షిపణి
నేడు రష్యా-ఉక్రెయిన్ రెండో దఫా చర్చలు!
ఉక్రెయిన్ దరఖాస్తుకు ఈయూ పార్లమెంట్ ఆమోదం
రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండో దఫా చర్చలు బుధవారం జరుగనున్నాయని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ మంగళవారం పేర్కొన్నది. ఈ మేరకు రష్యాకి చెందిన న్యూస్ ఏజెన్సీ టీఎఎస్ఎస్ని ఉటంకించింది. బెలారస్లోని గోమెల్ పట్టణంలో సోమవారం ఇరుదేశాల అధికారులు జరిపిన శాంతి చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. మరోవైపు యూరోపియన్ యూనియన్(ఈయూ)లో చేరేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పెట్టుకున్న దరఖాస్తును ఈయూ పార్లమెంట్ మంగళవారం ఆమోదించింది. ఇందుకు సంబంధించిన ప్రత్యేక ప్రక్రియను ప్రారంభించింది.