హైదరాబాద్: ఉక్రెయిన్లో ఏడో రోజూ రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ సైనికులు ఎదురుదాడికి దిగుతుండటంతో రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఆ దేశంలో రెండో అతిపెద్ద నగరమైన ఖార్కీవ్ (Kharkiv)పై రష్యా యుద్ధవిమానాలు దాడికి దిగాయి. మంగళవారం ఖార్కీవ్ నగర పరిపాలనా భవనం ఫ్రీడమ్ స్కేర్ను క్షిపణితో నేలమట్టం చేసిన రష్యన్ దళాలు.. నేడు స్థానిక దవాఖానపై దాడి చేశాయని ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. ‘ఖార్కీవ్లోకి రష్యా వైమానిక దళాలు అడుగుపెట్టాయి. స్థానిక దవాఖానపై దాడిచేశాయి. పోరాటం కొనసాగుతున్నది’ అని ఉక్రేనియన్ ఆర్మీ ప్రకటించింది.
క్షిపణి దాడిలో నామరూపాల్లేకుండా పోయిన ఫ్రీడమ్ స్కేర్.. సోవియెట్ యూనియన్ హయాం నుంచి పరిపాలన కేంద్రంగా ఉన్నది. అక్కడి ప్రసూతి వార్డును.. బాంబుల నుంచి రక్షణ కల్పించే ప్రాంతంగా అప్పటికప్పుడు మార్చారు. కాగా ఈ దాడి రష్యా ప్రభుత్వ ఉగ్ర చర్య అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. దీనిని ఎవరూ మరిచిపోలేరు. ఎవరూ క్షమించలేరు. మేమేంటో రుజువు చేసుకుంటున్నామని వెల్లడించారు.