ఇస్తాంబుల్/కీవ్, మార్చి 29: టర్కీలోని ఇస్తాంబుల్లో మంగళవారం రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య తొలిసారిగా జరిగిన ప్రత్యక్ష శాంతి చర్చలు సానుకూలంగా ముగిశాయి. అంతర్జాతీయ శాంతి ఒప్పందానికి కట్టుబడటానికి ఇరు దేశాలూ ఒప్పుకొన్నాయి. ఇందులో భాగంగా కీవ్, చెర్నిహివ్ నగరాలపై చేస్తున్న దాడులను తగ్గించేందుకు పుతిన్ సేనలు అంగీకరించాయి. చర్చల అనంతరం ఇరుదేశాల ప్రతినిధులు మాట్లాడారు. శాంతి చర్చల్లో తీసుకొన్న నిర్ణయం ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసం, భవిష్యత్తు చర్చలకు దోహదపడుతుందని రష్యా రక్షణశాఖ సహాయమంత్రి అలెగ్జాండర్ ఫొమిన్ తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య ప్రత్యక్ష భేటీ జరుగడానికి తాజా చర్చలు మరిన్ని బాటలు వేశాయని ఉక్రెయిన్ ప్రతినిధి డేవిడ్ అరఖామియా పేర్కొన్నారు. మరోవైపు, తాజా చర్చల్లో తీసుకొన్న నిర్ణయంపై విశ్వసనీయత కలిగించడానికి కీవ్, చెర్నిహివ్ నగరాల నుంచి కొన్ని సేనలను రష్యా ఉపసంహరించింది.
నాటో కూటమిలో చేరుతామంటూ ఇప్పటివరకూ పట్టుబట్టిన ఉక్రెయిన్ ఈ అంశంలో ఇకపై తటస్థంగా ఉంటామని చర్చల్లో భాగంగా తెలియజేసింది. అయితే నాటో దేశాలకు ఉండే భద్రతాపరమైన ఏర్పాట్లు కలిగిన మరో కూటమిలో తాము భాగంగా ఉండాలని కోరింది. దీనికి రష్యా కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తున్నది.
ఒకవైపు శాంతి చర్చలకు సిద్ధమవుతుండగానే.. ఉక్రెయిన్పై మంగళవారం ఉదయం రష్యా దాడులను కొనసాగించింది. మైకోలైవ్ నగరంలోని పరిపాలన భవనంపై జరిగిన క్షిపణి దాడిలో ఏడుగురు మరణించారని, మరో 22 మంది గాయపడ్డారని జెలెన్స్కీ తెలిపారు. ఖార్కీవ్ ప్రాంతానికి ఈశాన్యంలో ఉన్న లైబొతిన్ పట్టణంపై రష్యా చేసిన రాకెట్ దాడుల్లో పలు ఇండ్లు నేలమట్టమయ్యాయి. కాగా, మహిళలపై రష్యా సైనికులు ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. నాలుగేండ్ల బిడ్డ ఏడుస్తున్నా పట్టించుకోకుండా చిన్నారి తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతకుముందు ఆమె భర్తను హత్య చేశారు. తనకు జరిగిన దారుణాన్ని బాధితురాలు తాజాగా మీడియాకు వెల్లడించారు.
యుద్ధం ప్రారంభమై 34 రోజులైనా ఉక్రెయిన్పై పైచేయి సాధించలేని పుతిన్ సేనలు చివరకు రాజీమార్గాన్ని ఆశ్రయించినట్టు తెలుస్తున్నది. యుద్ధంలో భారీగా సైనికులను కోల్పోవడం, 65 కిలోమీటర్ల పొడవున్న యుద్ధ కాన్వాయ్ను ఉక్రెయిన్ ప్రత్యేక రక్షణ దళం తాజాగా ధ్వంసం చేయడం, ఇర్పిన్ వంటి కీలక నగరాలను ఉక్రెయిన్ సేనలు మళ్లీ క్రమంగా హస్తగతం చేసుకొంటుండటం, అంతర్జాతీయ ఆంక్షలు వెరసి.. చర్చల్లో రష్యా దిగిరావడానికి కారణంగా తెలుస్తున్నది. ఎంతగా ప్రయత్నించినప్పటికీ నాటో కూటమిలో సభ్యత్వం రాకపోవడం, పెద్దమొత్తంలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుండటంతో యుద్ధానికి తెరపడేలా చేయాలని ఉక్రెయిన్ కూడా ఒక మెట్టు కిందకు దిగినట్టు కనిపిస్తున్నది. నాటో కూటమిలో చేరికపై తటస్థంగా ఉంటామని ఉక్రెయిన్ ప్రకటించడం అందులో భాగమేనని విశ్లేషకులు అంటున్నారు.