మాస్కో: భారతదేశానికి రష్యా డిస్కౌంట్కు ముడిచమురును అందిస్తున్నది. అయితే పక్కదేశానికి అగ్గువకు ఇస్తుండటంతో తమకెందుకు ఇవ్వరనుకున్నారే ఏమో పాకిస్థాన్ పాలకులు.. అనుకున్నదే తడవుగా ఆ దేశ మంత్రి పొలోమని మాస్కో వెళ్లారు. 30 నుంచి 40 శాతం డిస్కౌంట్తో తమకు చమురు సప్లయ్ చేయాలని కోరారు. అయితే వారి అభ్యర్ధనను అక్కడి అధికారులు తిరస్కరించారు. దీంతో రిక్త హస్తాలతో స్వదేశానికి తిరుగుపయణమవ్వడం ఆయన వంతయ్యింది.
పాక్ పెట్రోలియం శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ నేతృత్వంలోని అధికారుల బృంధం.. ముడిచమురు ధర తగ్గించడంతోపాటు రవాణా ఖర్చులు, దిగుమతి చేసుకునే అవకాశాలను గురించి చర్చించేందుకు నవంబర్ 29న మాస్కోలో పర్యటించారు. మాస్కోలోని తమ రాయబార కార్యాలయ అధికారులతో కలిసి రష్యన్ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమకు తగ్గింపు ధరకు చమురు ఇవ్వాలని కోరారు. అయితే పాక్ ప్రతిపాదనను రష్యా అధికారులు తిరస్కరించారు.
ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో ఈయూ దేశాలతోపాటు ఇతర పాశ్చాత్య దేశాలు రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయకుండా ఆంక్షలు విధించాయి. దీంతో సహజ మిత్రదేశమైన భారత్కు డిస్కౌంట్పై ముడిచమురును అందించడానికి రష్యా ముందుకువచ్చింది. అప్పటి నుంచి భారత్ తక్కువ ధరకే రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నది.