హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ‘భూ రికార్డులు క్లియర్గా ఉన్న రాష్ర్టాలు లేదా దేశాల జీడీపీలో 3-4 శాతం వృద్ధి సాధిస్తున్నట్టు ప్రపంచ అనుభవాలు చెప్తున్నాయి. భగవంతుడు కరుణిస్తే త్వరలోనే భూ వివాదాల్లేని తెలంగాణను ఆవిష్కరిస్తాం’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ తరుచూ చెప్తున్నమాట. చెప్పడమే కాదు.. భూ రికార్డులను ప్రక్షాళన చేసి, ధరణి పోర్టల్ను ప్రారంభించి ఆచరణలో చేసి చూపుతున్నారు. దీంతో భూలావాదేవీల్లో పారదర్శకత పెరగడంతోపాటు, అత్యంత సులభంగా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తవుతూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిపారు. తాజాగా, సమగ్రసర్వే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయించింది. సర్వేపూర్తయితే రాష్ట్రప్రభుత్వంతోపాటు ప్రజలకు అనేక రూపాల్లో ప్రయోజనాలు చేకూరనున్నాయని నిపుణులు చెప్తున్నారు. వీటిన్నంటినీ ఆదాయంలో లెక్కిస్తే రూ.4 లక్షల కోట్లదాకా ఉంటుంది.
భూ రికార్డుల డిజిటలైజేషన్ వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రణాళికా సంఘం 2002-2005 మధ్య అధ్యయనం చేసింది. భూ వివాదాలు లేకుంటే దేశ జీడీపీ 1.3 శాతం అదనంగా వృద్ధి చెందుతుందని తేలింది. తెలంగాణకు సం బంధించి దీనివిలువ రూ.5వేల-6వేల కోట్ల వరకు ఉం టుందని నిపుణులు చెప్తున్నారు. ఒక్కసారి సమగ్ర సర్వే పూర్తిచేస్తే ఆ రికార్డులు కనీసం 30-35 ఏండ్లపాటు పనికొస్తాయని, వాటిని ముట్టుకోవాల్సిన పని ఉండదని పేర్కొంటున్నారు. దీనినిబట్టి ఏటా రూ.2 లక్షల కోట్ల వరకు రాష్ర్టానికి ప్రత్యక్షంగా ఆదాయం వస్తుందని వివరిస్తున్నారు.
భూరికార్డులు సక్రమంగా లేకపోతే ఒక రైతు ఎకరానికి ఏటా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం కోల్పోతున్నారని సర్వేలు చెప్తున్నాయి. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు, రైతు రుణాలు, సబ్సిడీలు ప్రత్యక్షంగా కోల్పోతుండగా, పరోక్షంగా భూమి విలువ పడిపోవడం, వివాద పరిష్కారం కోసం ప నులు వదిలిపెట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరగడం వంటి నష్టాలు కలుగుతున్నాయి. సమగ్ర సర్వేతో వీటికి చెక్ పడనున్నది. ప్రభుత్వ, ప్రైవేట్ భూముల వివరాలు, వాటి సరిహద్దులు పక్కాగా ఉంటే భూ వివాదాలకు ఆస్కారం ఉండదు. అలాంటి చోటే పరిశ్రమలు లేదా కార్యాలయాలు స్థాపించడానికి వ్యాపారవేత్తలు ఆసక్తి చూపుతారు. సమగ్ర సర్వేపూర్తయితే వీటిసంఖ్య పెరుగనున్నది.
సివిల్ కోర్టుల్లో 66 శాతం కేసులు భూ వివాదాలే. వీటికోసం ప్రభుత్వాలు, కక్షిదారులు పెడుతున్న ఖర్చు రూ.58 వేల కోట్లని అంచనా. ఇందులో కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరగడానికి దారి ఖర్చులు, తిండి ఖర్చులు, కోల్పోయే వేతనాలు వంటివాటి విలువే సుమారు రూ.28 వేల కోట్లుగా అంచనా. ఈ లెక్కన ఒక్కో రాష్ట్రంపై సగటున ఏటా రూ.2 వేల కోట్ల వరకు భారం పడుతున్నది. సర్వే పూర్తయితే ప్రజలకు, ప్రభుత్వానికి వెయ్యి కోట్ల చొప్పున ఆదా కావడంతోపాటు, కోర్టులపై ఒత్తిడి తగ్గుతుంది. నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రికార్డుల ప్రకారం దేశంలో జరిగే 12 శాతం హత్యలు, 60 శాతం ఇతర నేరాలకు మూలకారణం భూ వివాదాలే. భూ రికార్డులు క్లియర్గా మారిం తే.. ఘర్షణలు, నేరాలు తగ్గడంతోపాటు శాంతిభద్రతల సమస్య తీరుతుంది. పోలీసులకు పనిభారం సగానికిపైగా తగ్గుతుంది.
సమగ్ర సర్వే విజయవంతంగా పూర్తయితే రాష్ర్టానికి రాబోయే 30 ఏండ్లలో సుమారు రూ.4లక్షల కోట్ల మేర ప్రయోజనం కలుగుతుంది. అంతేకాదు.. టైటిల్ గ్యారంటీ ఇచ్చే అవకాశం వస్తుంది. రైతుల ఆదాయాన్ని డబుల్ చేయాలంటే చిల్లులు పడ్డ కుండలో నీళ్లు పోయడం కాదు.. దానికున్న ఉన్న రంధ్రాలను ముందుగా మూసేయాలి. భూ సంస్కరణలు పూర్తిచేసి, టైటిల్ గ్యారంటీ ఇచ్చిన దేశాలు మాత్రమే అభివృద్ధి చెందినవిగా మారాయి.
– సునీల్కుమార్, అనుబంధ ఆచార్యుడు, నల్సార్ వర్సిటీ