దుండిగల్ / తెలుగు యూనివర్సిటీ, ఏప్రిల్ 19 : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 38వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం బాచుపల్లిలోని యూనివర్సిటీ ప్రాంగణం విస్తరణ సేవా విభాగంలో ఘనంగా నిర్వహించారు. ప్రతిఏటా సాహిత్య, సాంస్క్రృతిక, లలిత కళా రంగాల నుంచి ప్రముఖులను ఎంపిక చేసి విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వారికి విశిష్ట పురస్కారం పేరిట సత్కరిస్తుంది. 2022 ఏడాదికి గాను ప్రముఖ చిత్రకారులు సీవీ.అంబాజీకి విశిష్ట పురస్కారం ప్రదానం చేయడంతో పాటు లక్ష రూపాయల నగదును అందజేసి సత్కరించారు. అంతకు ముందు సభాధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు(వైస్చాన్స్లర్) తంగెడ కిషన్రావు మాట్లాడుతూ వెయ్యేండ్ల వరకు నిలిచే విధంగా తెలుగు విశ్వవిద్యాలయం రూపొందాలని, వర్సిటీలోని శాఖలన్నింటికీ ప్రత్యేక భవనాలు నిర్మించే విధంగా రూపకల్పన జరగాలనే సంకల్పంతో బాచుపల్లి ప్రాంగణంలోకి అడుగుపెట్టామన్నారు.
జానపదుడిగా ప్రాథమిక విద్యతోనే చదువును ముగించి, ప్రపంచస్థాయి చిత్రకారుడిగా ఎదిగిన అంబాజీకి విశిష్టపురస్కారం అందజేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఎస్వీ విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని సంస్కృతిని పరిరక్షిస్తున్న తెలుగు విశ్వవిద్యాలయాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి కృషి జరగాలని, కేవలం పురస్కారాలను అందించడమే కాకుండా దేశీ, జానపద, సాంప్రదాయ కళలను సమాజానికి అందించే దిశగా వర్సిటీ పనిచేయాలన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ ఉన్నతాధికారి, ప్రముఖ కవి, డా.ఏనుగు నర్సింహరెడ్డి మాట్లాడుతూ తనకు తెలుగు యూనివర్సిటీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అంతకు ముందు విశ్వవిద్యాలయం లలిత కళాపీఠం ఆధ్వర్యంలో ప్రదర్శించిన జానపద, సంగీత, నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా డప్పు కళాకారుల ప్రదర్శన, పేరిణీ నృత్యం విశేషంగా ఆకర్షించాయి. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య బట్టు రమేశ్ స్వాగతం పలుకగా, విస్తరణ సేవా విభాగం సహాయ సంచాలకులు రింగు రామ్మూర్తి సమన్వయకర్తగా వ్వవహరించారు.