Harish Rao | మైనార్టీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఒక్క మైనార్టీకి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని అన్నారు. మైనార్టీలపై కాంగ్రెస్ ప్రేమ ఇదేనా? అని ప్రశ్నించారు. జహీరాబాద్లో శుక్రవారం రాత్రి హరీశ్రావు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్క మైనార్టీ నాయకుడు కూడా దొరకలేదా అని ప్రశ్నించారు. గతంలో మైనార్టీ లేకుండా కేబినెటే ఉండేది కాదని గుర్తు చేశారు. తొలిసారి మైనార్టీ మంత్రి లేకుండా ప్రభుత్వం నడుస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను పూర్తిగా మరిచిపోయిందని విమర్శించారు.
వంద రోజుల్లో హామీలు పూర్తి చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు చెప్పారని హరీశ్రావు అన్నారు. వంద కాదు.. 120 రోజులయ్యింది.. హామీల అమలు ఎక్కడా? అని ప్రశ్నించారు. మూడు వేల మంది మైనార్టీ విద్యార్థులకు కేసీఆర్ స్కాలర్షిప్లు ఇచ్చారని అన్నారు. పేద విద్యార్థులను విదేశాలకు పంపించి చదివించారని అన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక ఆ స్కీమ్ కూడా బంద్ అయ్యిందని తెలిపారు.
రేవంత్ రెడ్డి బీజేపీ ఏజెంట్ అని హరీశ్రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కలిసి పనిచేశాయని అన్నారు. కాంగ్రెస్ గెలిచాక గాంధీభవన్ ముందు టీడీపీ జెండాలు కనిపించాయని గుర్తు చేశారు. బీజేపీతో రేవంత్రెడ్డి మిలాఖత్ అయ్యిండని విమర్శించారు. రేవంత్ రెడ్డి పంపిన ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ వెంటనే ఆమోదించారని తెలిపారు. కానీ కేసీఆర్ పంపిన పేర్లను మాత్రం గవర్నర్ తిరస్కరించారని చెప్పారు. దీన్ని బట్టే బీజేపీతో అంటకాగుతున్నదెవరో తెలిసిపోయిందని అన్నారు. గుజరాత్ మోడల్ ఫెయిల్ అని రాహుల్గాంధీ అంటున్నారని.. అదే గుజరాత్ మోడల్ తెస్తానని రేవంత్ రెడ్డి చెబుతున్నారని విమర్శించారు. అదానీ ఫ్రాడ్ అని రాహుల్ అంటే.. లవ్లీమాన్ అని రేవంత్ రెడ్డి అంటున్నారని అన్నారు. ఒకవైపు అదానీని రాహుల్ గాంధీ తిడుతుంటే.. ఇంకోవైపు అదానీని రేవంత్ రెడ్డి కౌగిలించుకుంటున్నారని చెప్పారు.