హైదరాబాద్ : రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. గత గురువారం నుంచి యుద్ధం ప్రారంభం కాగా, ఉక్రెయిన్లో ఇప్పటి వరకు 352 మంది పౌరులు మృతి చెందినట్లు ఉక్రెయిన్ అధికార యంత్రాంగం ప్రకటించింది. ఇందులో 14 మంది చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. ఖార్కివ్ నగరంలో 11 మంది పౌరులు మరణించినట్లు వెల్లడించింది. ఉక్రెయిన్లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్లో నివాస సముదాయాలను లక్ష్యంగా చేసుకుని రష్యా బలగాలు దాడులకు పాల్పడింది.
సోమవారం శాంతి చర్చలు ముగిసిన తర్వాత ఖార్కీవ్ నగరంపై క్లస్టర్ బాంబులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ సైన్యం ఉన్న ప్రాంతాలతో పాటు జనావాసాలపైనా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ఖార్కీవ్లోనే పదుల సంఖ్యలో పౌరులు మరణించగా, వందల మంది గాయపడ్డారు. రాజధాని కీవ్ నగరంపై పట్టు కోసం రష్యా సైనిక చర్యను ఉద్ధృతం చేసింది. నగరం నలువైపుల నుంచి మరిన్ని బలగాలు దూసుకువస్తున్నాయి. కర్ఫ్యూ సడలించడంతో కీవ్లో ప్రజలు ఆహార పదార్థాలు, నిత్యావసరాల కోసం మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ఎదుట క్యూ కట్టారు.