దాడులు మరింత తీవ్రతరం చేసిన రష్యా
నివాస భవనాలపై విరుచుకుపడ్డ క్షిపణులు
రష్యా దాడుల్లో ఫాక్స్న్యూస్ జర్నలిస్ట్ మృతి
ఉక్రెయిన్ నుంచి ఇప్పటివరకు 30 లక్షల మంది వలస
జెలెన్స్కీ సేనలకు ఆయుధాలు ఇస్తామన్న అమెరికా
బైడెన్, హిల్లరీ క్లింటన్, జస్టిన్ ట్రూడోపై రష్యా ఆంక్షలు
ఆన్లైన్ తరగతులు ప్రారంభించిన ఉక్రెయిన్ వర్సిటీలు
కీవ్, మార్చి 15: ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా బాంబుల దాడిని మరింత ఉద్ధృతం చేసింది. మంగళవారం జరిపిన దాడుల్లో నగరంలోని ఓ 15 అంతస్తుల బిల్డింగ్తో పాటు పలు భవనాలు ధ్వంసమయ్యాయి. డజన్ల సంఖ్యలో మరణాలు సంభవించినట్టు సమాచారం. పలు ఇతర నగరాల్లో కూడా రష్యా బలగాలు దాడులు కొనసాగాయి. కీవ్లో పేలుళ్ల ధాటికి బాంబ్ షెల్టర్గా వినియోగించే ఒక సబ్వే స్టేషన్ ధ్వంసమైంది. 2 వేల కార్లలో పౌరులు మానవతా కారిడార్ ద్వారా మరియుపోల్ నుంచి వలస వెళ్లిపోయారు. పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతంలోని రివ్నే పట్టణం సమీపంలోని ఓ టీవీ టవర్పై రష్యా బలగాల దాడిలో 19 మంది మరణించగా, మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. రష్యాదాడుల్లో కీవ్ సమీపంలో ఫాక్స్ న్యూస్కు చెందిన కెమెరామెన్ పియరీ మరణించాడు. 30 లక్షల మందికి పైగా ప్రజలు ఉక్రెయిన్ వీడిపోయారని అంతర్జాతీయ శరణార్థి సంస్థ పేర్కొన్నది. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య ప్రతినిధుల మధ్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరో రౌండ్ చర్చలు ప్రారంభమయ్యాయి. నాటోలో చేరలేమన్న విషయాన్ని గ్రహించామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. యుద్ధ విమానాలు పంపాలని పశ్చిమ మిత్ర దేశాలను కోరారు.
ఉక్రెయిన్కు ముగ్గురు దేశాధినేతలు
రష్యా సేనలు దాడులు ఉద్ధృతం చేస్తున్న క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఐరోపాకి చెందిన మూడు దేశాల నేతలు ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. పోలండ్, చెక్ రిపబ్లిక్, స్లొవేనియా (నాటో సభ్యులు) దేశాల ప్రధానులు మటేయుస్జ్ మొరావిక్కి, పీటర్ ఫియాలా, జానెజ్ జన్సా మంగళవారం రైలులో కీవ్కు బయలుదేరారు. వీరు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ప్రధాని డెనిస్లను కలువనున్నారు. ఉక్రెయిన్కు మద్దతు ఇచ్చేందుకు తాము ఆ దేశ పర్యటనకు వెళ్తున్నామని పీటర్ ఫియాలా పేర్కొన్నారు. మరోవైపు రష్యాపై యూకే మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించింది. రష్యా లగ్జరీ గూడ్స్ ఎగుమతులు నిలిపేయడంతో పాటు ఆ దేశం నుంచి వచ్చే వోడ్కా వంటి ఉత్పత్తులపై టారిఫ్లను విధించింది. మరో 17 మందికి పైగా రష్యా రాజకీయ నేతలు, వారి బంధువుల ఆస్తులను జపాన్ స్తంభింపజేసింది.
విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు ప్రారంభం
ఉక్రెయిన్ నుంచి వచ్చేసిన భారతీయ మెడికల్ విద్యార్థులకు ఉపశమనం కలిగింది. ఇవానో-ఫ్రాంకివ్స్, విన్నిత్సియా, బోగోమోలెట్స్ నేషనల్ మెడికల్ వర్సిటీలతో పాటు పశ్చిమ ఉక్రెయిన్లోని పలు వర్సిటీలు సోమవారం నుంచి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు ప్రారంభించాయి. అధ్యాపకులు ఇండ్ల నుంచే బోధిస్తున్నారు. ఇతర యూనివర్సిటీలు కూడా తరగతులను త్వరలో తిరిగి ప్రారంభించే యోచనలో ఉన్నాయి.
బైడెన్, క్లింటన్పై ఆంక్షలు
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో తమపై ఆంక్షలు విధించిన అమెరికా, తదితర దేశాలపై రష్యా ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, పలువురు ప్రభుత్వ కీలక అధికారులపై ఆంక్షలు విధించింది. అలాగే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై నిషేధం విధించింది.
10-14 రోజులకే ఆయుధ సామర్థ్యం
రష్యాకు పూర్తిస్థాయి యుద్ధం చేసేందుకు మరో 10 నుంచి 14 రోజులే ఆయుధ సంపత్తి ఉందని యూకే రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నాయి. రష్యా సైనిక శక్తి తగ్గిపోయిందని, త్వరలో రష్యా కంటే ఉక్రెయిన్ పైచేయి సాధించొచ్చని అంచనా వేశాయి. రష్యా ప్రభుత్వ టెలివిజన్ చానెల్ ప్రత్యక్ష ప్రసారమవుతున్న సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకున్నది. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తున్న ఆ చానల్లోనే పనిచేసే మరీనా అనే మహిళా ఉద్యోగి నేరుగా లైవ్లో వార్తలు చదువుతున్న యాంకర్ వెనుకకు వెళ్లి ‘నో వార్’ అనే పోస్టర్ ప్రదర్శించారు. యుద్ధంపై రష్యా ప్రభుత్వ ప్రచారం నమ్మొద్దని వీక్షకులను కోరారు. ఆక్రమించుకున్న ఖేర్సాన్ పట్టణంలో తమ అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్లాన్లో రష్యా ఉన్నదని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. ఉక్రెయిన్కు ఆయుధాలు అందజేస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు.