భారత్ను 250 ఏండ్లు నిరంకుశంగా ఏలిన ఆంగ్ల గడ్డపై ఓ భారత సంతతి వ్యక్తి జెండా ఎగరేశాడు. ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యంగా వెలుగొంది, నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గ్రేట్ బ్రిటన్ను కాపాడటానికి నేనున్నానంటూ ముందడుగు వేశాడు. బ్రిటన్ ప్రధానమంత్రిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ మంగళవారం అధికారం చేపట్టారు. బ్రిటన్కు ఆయన తొలి భారత సంతతి ప్రధాని మాత్రమే కాకుండా, తొలి హిందూ ప్రధాని కూడా. బ్రిటన్ను ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడి, భవిష్యత్ తరాలకు మంచి జీవితాలు ఇచ్చేందుకు రాత్రి పగలు అన్న తేడా లేకుండా కష్టపడుతానని ప్రధానిగా తన తొలి ప్రసంగంలో రిషి ప్రతిజ్ఞ పూనారు.
లండన్, అక్టోబర్ 25: బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ నియమితులయ్యారు. గత 210 ఏండ్లలో బ్రిటన్ పాలనా పగ్గాలు చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా ఆయన రికార్డు నెలకొల్పారు. ప్రస్తుతం దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నదని, కఠిన నిర్ణయాలు తప్పవని తన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు. కాగా, ఓటమి ఎదురైన చోటనే రిషి సునాక్ గెలుపు బావుటా ఎగురవేశారు. రెండు నెలల క్రితం బోరిస్ జాన్సన్ రాజీనామాతో ఏర్పడిన ప్రధాని పీఠాన్ని అధిరోహించేందుకు నిర్వహించిన ఓటింగ్లో చివరి వరకూ పోరాడి లిజ్ట్రస్ చేతిలో సునాక్ ఓడిపోయారు. 42 రోజులకే అనేక తప్పుడు నిర్ణయాలతో అప్రతిష్ఠ మూటగట్టుకొని లిజ్ ప్రధాని పదవి నుంచి వైదొలగటంతో రిషి మళ్లీ పోటీలోకి వచ్చారు. ఈసారి నేరుగా బోరిస్నే ఢీకొట్టారు. బోరిస్ మధ్యలోనే పోటీ నుంచి వైదొలగటం, మూడో పోటీదారుగా ఉన్న కామన్స్ లీడర్ పెన్నీ మోర్టాండ్ చివరి నిమిషంలో తప్పుకోవటంతో రిషి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లిజ్ ట్రస్ రాజీనామా చేసిన మరుక్షణం నుంచే కన్జర్వేటివ్ పార్టీలో మెజారిటీ ఎంపీలు రిషికి మద్దతు ప్రకటించటం మొదలుపెట్టారు. బ్రిటన్కు రిషి 57వ ప్రధానమంత్రి.
బ్రేవర్మన్కు మళ్లీ మంత్రి పదవి
ప్రధాని పగ్గాలు చేపట్టిన వెంటనే సునాక్ మంత్రివర్గ కూర్పుపై దృష్టిపెట్టారు. ఉపప్రధానిగా డొమినిక్ రాబ్ను నియమించారు. పలువురు మంత్రులకు ఉద్వాసన పలికిన ఆయన.. ఆర్థికమంత్రిగా జెరెమీ హంట్ను కొనసాగించారు. గతవారమే మంత్రిపదవికి రాజీనామా చేసిన భారతసంతతికి చెందిన సువెల్లా బ్రేవర్మన్ను తిరిగి హోంమంత్రిగా నియమించారు.
హోంమంత్రి సువెల్లా
ఎంపీ అయిన ఏడేండ్లకే ప్రధాని పీఠం
2015లో తొలిసారి ఎంపీగా ఎన్నికైన రిషి సునాక్ కేవలం ఏడేండ్లలోనే ప్రధాని పీఠాన్ని చేరుకొన్నారు. రిషి తాత భారత్లోని పంజాబ్కు చెందినవారు. రిషి తండ్రి యశ్వీర్ వైద్యుడు, తల్లి ఉష ఫార్మసిస్టు. వీరు 1960లో తూర్పు ఆఫ్రికా నుంచి బ్రిటన్ వలస వెళ్లారు. వీరికి సౌతాంప్టన్లో 1980 మే 12న రిషి జన్మించారు. విన్చెస్టర్ పాఠశాలలో ప్రాథమిక విద్య, ఆక్స్ఫర్డ్ వర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించారు. విద్యార్థిగా ఉన్నప్పుడే సౌతాంప్టన్లో రిషి ఓ ఇండియన్ రెస్టారెంట్లో వెయిటర్గా పార్ట్టైమ్ ఉద్యోగం చేశారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. 2010లో మిత్రులతో కలిసి థెలీమ్ పార్ట్నర్స్ సంస్థను స్థాపించారు. 2013 నుంచి 2015 వరకు కాటామారన్ వెంచర్స్ డైరెక్టర్గా ఉన్నారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన రిషి, 2015లో యార్క్షైర్లోని రిచ్మండ్ నుంచి ఎంపీగా గెలిచారు. మొదట థెరిసా మే ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా పనిచేసిన ఆయన, అనంతరం బోరిస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు.కన్జర్వేటివ్పార్టీలోని అత్యంత ధనవంతులైన ఎంపీల్లో రిషి ఒకరు. 2009లో ఆయన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షత మూర్తిని ప్రేమ వివాహం చేసుకొన్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు.
భార్యా పిల్లలతో రిషి
ఆర్థిక స్థిరత్వమే నా మొదటి లక్ష్యం: రిషి
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్రిటన్కు తిరిగి పూర్వవైభవం తేవటమే తన మొదటి లక్ష్యమని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తెలిపారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన కార్యాలయం 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘దేశ సమగ్రత, జవాబుదారీతనం పెంపొందించేందుకు కృషి చేస్తా. గత ప్రధాని చేసిన పొరపాట్లను సరిదిద్దేందుకే కన్జర్వేటివ్ పార్టీ నన్ను నాయకుడిగా ఎన్నుకొన్నది. ఆ పని ఇప్పటికే మొదలైంది. నేను ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు, వ్యాపారుల ఆర్థిక ప్రయోజనాలు కాపాడేందుకు పలు పథకాలు అమలుచేశాను. అదే నిబద్ధతతో ప్రస్తుత సంక్షోభాన్ని నివారించేందుకు కష్టపడుతాను. భవిష్యత్తు తరాలను అప్పులు కూడా చెల్లించలేని బలహీనులుగా వదిలేయను. మాటలతో కాకుండా చేతలతో మన దేశాన్ని ఏకం చేసేందుకు రాత్రి పగలు అన్న తేడా లేకుండా కష్టపడుతాను’ అని ప్రకటించారు.