లండన్, జూలై 6: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు హయాంలో దేశంలో మైనారిటీలపై దాడులు పెరుగడాన్ని నిరసిస్తూ ఆదివారం లండన్ వీధుల్లో ఎన్ఆర్ఐలు, భారత సంతతికి చెందిన వ్యక్తులు నిరసనలు హోరెత్తించారు. బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.15కు పైగా ఇండియన్ డయాస్పొరా గ్రూప్లు ఈ ఆందోళనల్లో పాల్గొన్నాయి.
ప్రధాని మోదీ ఫాసిస్ట్ విధానాలను తీసుకొస్తున్నారని నిరసనకారులు మండిపడ్డారు. ముస్లింలపై ప్రభుత్వ ప్రేరేపిత హత్యలు, రేప్లు పెరిగాయని, లక్షిత వర్గాల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చేయడం నిత్యకృత్యంగా మారిందని దుయ్యబట్టారు. లండన్లోని ఇండియన్ హై కమిషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
మీ పోరాటం.. మా పోరాటం
భారత్లోని తమ ఇండ్లను బుల్డోజర్లతో కూల్చేసిన మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఎన్ఆర్ఐ అఫ్రీనా ఫాతిమా, మరికొందరు ముస్లింలు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఆందోళనకారులకు సంఘీభావం ప్రకటించిన లీసెస్టర్ ఈస్ట్ ఎంపీ క్లాడియా వెబ్ మాట్లాడారు. భారత్లో తమ హక్కుల కోసం పోరాడుతున్న మైనారిటీల ప్రజలతో మాట్లాడినట్టు పేర్కొన్నారు. వారి పోరాటాన్ని తమ పోరాటంగా భావిస్తామన్నారు.
భారత్లో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, దళితులు, ఆదివాసీలు వివక్షకు గురవుతున్నారని, ఆ వర్గాలపై దాడులు పెరిగిపోయాయని నివేదికలు వెల్లడించినట్టు ఆమె గుర్తుచేశారు. మైనారిటీలపై దాడుల విషయంలో దక్షిణ ఆసియా డయాస్పొరా ఆందోళనలో ఉన్నట్టు వివరించారు.