న్యూఢిల్లీ, ఏప్రిల్ 9 : కాల్పుల విరమణపై తుది ఒప్పందం కుదిరి అది పూర్తిగా అమలు జరిగే వరకు ఇరాన్ లోపల, చుట్టూ అమెరికా సైనిక బలగాల మోహరింపు కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. పశ్చిమాసియాలో కాల్పుల విరమణ పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్న నేపథ్యంలో ఇరాన్పై ఒత్తిడిని కొనసాగించాలని ట్రంప్ భావిస్తున్నట్లు ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఇప్పటికే గణనీయంగా బలహీనపడిన శత్రువును ఎదుర్కొనడానికి, నాశనం చేయడానికి అవసరమైన అదనపు మందుగుండు సామగ్రి, ఆయుధాలు, అన్ని అమెరికా నౌకలు, విమానాలు, సైనిక సిబ్బంది ఒప్పందం కుదిరి, పూర్తిగా అమలయ్యే వరకు ఇరాన్లోపల, దాని పరిసర ప్రాంతాలలోనే ఉంటాయి అని ట్రూత్ సోషల్లో ట్రంప్ తెలిపారు.
అవగాహన ఉల్లంఘన తీవ్ర సైనిక ప్రతిస్పందనకు దారితీయగలదని ఆయన హెచ్చరించారు. ఏ కారణం చేతనైనా దీన్ని పాటించకపోతే అప్పుడు కాల్పులు మొదలవుతాయని, మునుపెన్నడూ ఎవరూ చూడనంత శక్తివంతమైనవిగా ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా కీలక లక్ష్యాలను పునరుద్ఘాటిస్తూ ఇరాన్ అణ్వాయుధాలు సంపాదించకూడదని, హొర్ముజ్ జలసంధి తెరిచి, సురక్షితంగా ఉండాలని ఆయన తెలిపారు.